'లంచం ఇచ్చి జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందుతా'... స్పందించిన నిర్మలా సీతారామన్!

ఈ సందర్భంగా... ఆ విభాగాన్ని నిర్వహిస్తున్న అధికారులనూ తప్పుపట్టిన ఆయన.. దీనిపై అగ్రశ్రేణి యాజమాన్యం జోక్యం చేసుకోవాలని కోరారు.;

Update: 2025-06-01 01:30 GMT
లంచం ఇచ్చి జీఎస్టీ  రిజిస్ట్రేషన్  పొందుతా... స్పందించిన  నిర్మలా సీతారామన్!

జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మోసపూరిత కార్యకలాపాలు జరిగాయంటూ సోషల్ మీడియా పోస్ట్ లో వచ్చిన వార్తలపై తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వీజీ లెర్నింగ్ డెస్టినేషన్ ఫౌండర్, డైరెక్టర్ వినోద్ గుప్తా చేసిన లింక్డ్ ఇన్ పోస్ట్ వైరల్ అయిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. తన సంస్థ రిజిస్ట్రేషన్ కోసం లంచం ఇవ్వాల్సి వస్తుందని గుప్తా ఆరోపించారు.

అవును... జీఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి తాను లంచం ఇవ్వాల్సి రావొచ్చు అన్నట్లుగా వినోద్ గుప్తా చేసిన లింక్డ్ ఇన్ పోస్ట్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులో... తాను 20 రోజుల క్రితం జీఎస్టీ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా అది తనకు అందలేదని గుప్త పేర్కొన్నారు. దానికోసం తాను రేపు 'నేరం' చేస్తాను అని రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా.. లంచం ఇవ్వడం, తీసుకోవడం.. రెండూ నేరాలే అని చెప్పిన ఆయన.. తన భార్య, కుమార్తె భాగస్వాములుగా ఉన్న సంస్థ కోసం తాను సుమారు 20 రోజుల క్రితం జీఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నాను అని రాశారు. ఈ క్రమంలో "నేను రేపు జీఎస్టీ నెంబర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.. నేరం చేసిన తర్వాత దాన్ని పోందుతానని నాకు తెలుసు" అని ఆయన అన్నారు.

దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇందులో భాగంగా... పన్ను చెల్లింపుదారులకు సేవ చేయడం మన బాధ్యత అని.. కాని, అలా చేస్తున్నప్పుడు మనం నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలని.. అప్పుడే మనం వారి నమ్మకాన్ని సంపాదిస్తామని అన్నారు. జీఎస్టీ బోర్డు, అధికారులు.. ప్రజల సమస్యలపై జాగ్రత్తగా, త్వరగా స్పందిస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు.

మరోపక్క గుప్తా పొస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. వీరిలో టాక్స్ కంప్లైయన్స్ & లిటిగేషన్ నిపుణుడు అభిషేక్ రాజా రామ్ కూడా ఉన్నారు. తాజాగా దీనిపై స్పందించిన ఆయన... జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ని ట్యగ్ చేశారు.

ఈ సందర్భంగా... ఆ విభాగాన్ని నిర్వహిస్తున్న అధికారులనూ తప్పుపట్టిన ఆయన.. దీనిపై అగ్రశ్రేణి యాజమాన్యం జోక్యం చేసుకోవాలని కోరారు. దీనిపై సీబీఐసీ వెంటనే స్పందించింది. మే 26న గుప్తా దరఖాస్తు ప్రక్రియను దాఖలు చేశారని.. ఆయనను కేంద్ర జీఎస్టీ అధికారులకు కాకుండా ఢిల్లీ రాష్ట్ర జీఎస్టీ అధికార పరిధికి నియమించారని బోర్డు స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ఆయన దరఖాస్తును వెంటనే ప్రాసెస్ చేశామని.. కానీ, రెంటల్ అగ్రిమెంట్ లో పేరు లేకపోవడంతో ఒక ప్రశ్న తలెత్తిందని తెలిపింది. ఈ విషయాన్ని ఇప్పటికే దరఖాస్తుదారునికి తెలియజేశామని, అయితే, అటువైపు నుంచి ఇంకా ఎలంటి స్పందన రాలేదని తెలిపింది. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయొద్దని రాజా రామ్ ని కోరింది.

Tags:    

Similar News