ఈ ఖైదీ చాలా రిచ్ గురూ.. సంపద విలువ 3.6 లక్షల కోట్లు!
అవును... తాజాగా ప్రపంచంలోని అత్యంత ధనిక ఖైదీగా రికార్డ్ సృష్టించారు క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో
సాధారణంగా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు.. మహిళా ధనవంతులు.. అనే జాబితా దర్శనమిస్తుంటుంది కానీ... తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ గురించిన చర్చ ఇప్పుడు మొదలైంది. పైగా.. అతడి ఆస్తి ఏకంగా మూడున్నర లక్షల కోట్లకంటే ఎక్కువగా ఉండటంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అవుతుంది. దీంతో... ఎవరీ చాంగ్ జావో అనే క్వశ్చన్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్లింది!
అవును... తాజాగా ప్రపంచంలోని అత్యంత ధనిక ఖైదీగా రికార్డ్ సృష్టించారు క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో. ఈయన ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మనీలాండరింగ్ నిరోధక, ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావోను గతేడాది అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. ఈ సమయంలో... ఆయనకు కనీసం మూడు ఏళ్ల జైలు శిక్షను విధించాలని న్యాయవాదులు కోరారు!
అయితే చాంగ్ జావో ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఆయనకు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అత్యంత ధనిక ఖైదీగా రికార్డులకెక్కారు. ఈ నేపథ్యంలో... బ్లూంబర్గ్ అంచనా ప్రకారం.. చాంగ్ జావో సంపద విలువ సుమారు 43 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.60 లక్షల కోట్లు)గా ఉంది!
ఇక 2017లో బినాన్స్ ను స్థాపించిన చాంగ్ జావో... కొన్ని సంవత్సరాలలోనే బిలియనీర్ గా ఎదిగారు. ఈ సంస్థ క్రిప్టో ఎక్స్ ఛేంజ్ లను నడుపుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో... అమెరికా అధికారులతో చేసిన ఒప్పందంలో భాగంగా జావో బినాన్స్ సీఈఓ బాధ్యత నుంచి గతేడాది వైదొలిగారు. అయినప్పటికీ ఆయనకు సంస్థలో 90 శాతం వాటా ఉంది.
అయితే ప్రపంచ మార్కెట్లో క్రిప్టో కూలిపోవడంతో చాంగ్ జావో సంస్థ తిరోగమనం పట్టిందని అంటున్నారు. ఈ క్రమంలోనే అతడు మనీలాండరింగ్ ఆంక్షల చట్టాలను ఉల్లంఘించాడనే నేరం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... అధిక రిస్క్ తో కూడిన పెట్టుబడుల కోసం కస్టమర్ల ఫండ్ ల నుంచి బిలియన్ డాలర్లను అతడు మాయం చేసినట్లు విచారణలో తేలింది. దీంతో... అతనికి కొర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది.