ఏడాది ఎమ్మెల్యేలు: 30 పర్సంట్ డ్రాబాక్..!
రాష్ట్రంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న దరిమిలా.. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు.;

రాష్ట్రంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న దరిమిలా.. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అయితే.. ఈ ఏడాది కాలంలో ఓ పది నుంచి 15 మంది మినహా.. ఇతర ఎమ్మెల్యేల తీరు ఆశించినంత తీరులో లేదన్నది ప్రజలు చెబుతున్న మాట. అంతేకాదు.. ఏడాది కాలంలో వారి గ్రాఫ్ 30 శాతం మేరకు తగ్గిందన్న విషయం కూడా చర్చకు వస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 80 మంది కొత్తవారు విజయం దక్కించుకున్నారు. అయితే.. వీరిలో దాదాపు 70 శాతం మంది అసలు ఇప్పటి వరకు ప్రజల మధ్యకు రాలేదని తెలుస్తోంది.
మరోవైపు కూటమి పార్టీల్లోనూ టీడీపీకి చెందిన 134 మందిలో మంత్రులను పక్కన పెడితే.. మిగిలిన వారిలోనూ 72 శాతం మంది ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. కొందరు మాత్రమే ప్రజల మధ్యకు వస్తున్నారు. కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో గ్రాఫ్ తగ్గుముఖం పట్టిందన్నది వాస్తవం. నిజానికి పైస్థాయిలో చంద్రబాబు విషయంలో ఉన్న నమ్మకం.. విశ్వాసం వంటివి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదు.. వారితో ప్రజలకు కూడా అనుబంధం దాదాపు తక్కువగా నే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు పదే పదే మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా హెచ్చరించారు.
అందరూ ప్రజల్లోనే ఉండాలని కూడా చెప్పారు. కానీ, పరిస్థితి పైకి చెప్పుకొంటున్నట్టుగా అయితే లేదు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కొంత మేరకు ఆఫీసులు నిర్వహిస్తున్నారు. తమ వద్దకు వచ్చే వారిని అడ్రస్ చేసేందుకు ఆఫీసులో ఒకరిద్దరు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. కానీ.. నగరాలకు దూరంగా.. మన్యం సహా ఎస్సీనియోజకవర్గాల పరిస్థితి మాత్రం తీవ్ర ఇబ్బందిగానే ఉంది. అక్కడ ప్రజలకు ఎమ్మెల్యేలు కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. గత ఎన్నికల సమయంలో మన్యం సహా.. ఎస్సీ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాలను ఎన్నికలు ముగిసిన వెంటనే తీసేశారు.
దీంతో తమ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వచ్చే ప్రజలునానా ప్రయాస పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అంతేకాదు.. అసలు వచ్చినా.. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడం లేదన్న చర్చ కూడా ఉంది. కురుపాం, పాలకొండ వంటి నియోజకవర్గా లుఈ జాబితాలో ముందు వరుసలో ఉండగా.. శింగనమల నియోజకవర్గంలో ఒకే ఒక్క కార్యాలయం అందుబాటులో ఉంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి. దీంతో ప్రజలకు-ఎమ్మెల్యేలకు మధ్య కనెక్టివిటీ బాగా తక్కువగా ఉందన్న టాక్ జోరుగానే వినిపి స్తోంది. దీంతో గత ఎన్నికల సమయంలో ఉన్న గ్రాఫ్ 100 శాతం అనుకుంటే.. ఇప్పుడు అది 70 శాతానికి తగ్గుముఖం పట్టిందన్న వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.