సీనియర్స్ అంతా బిజీ బిజీగా గడిపేస్తున్నారు ఎందుకు?
తెలుగులో చిరు, వెంకీ, నాగ్, బాలయ్య, తమిళంలో కమల్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి వరుస ప్రాజెక్ట్లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.;
ఒక దశలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా బిజీగా గడిపిన వారు ఒక ఏజ్ వచ్చేశాక స్పీడు తగ్గించేస్తారు. అవసరం అనుకున్నవి మాత్రమే చేస్తూ కాస్త రిలాక్స్ అవుతుంటారు. కానీ సీనియర్ స్టార్స్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ షాక్ ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా బిజీబిజీగా గడిపేస్తున్నారు. యంగ్ హీరోలకు మించి వరుస క్రేజీ ప్రాజెక్ట్లని పట్టాలెక్కించేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. తెలుగులో చిరు, వెంకీ, నాగ్, బాలయ్య, తమిళంలో కమల్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి వరుస ప్రాజెక్ట్లతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
మెగాస్టార్, బాలయ్య, నాగ్ , వెంకీ...
తెలుగులో మన సీనియర్ స్టార్స్ యమ బిజీగా గడిపేస్తున్నారు. ఈ నలుగురిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వరుస ప్రాజెక్ట్లలో నటిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి బరిలో దిగి `మన శంకరవరప్రసాద్గారు`తో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న చిరు దీని తరువాత జోష్ పెంచారు. ఇప్పటికే `విశ్వంభర`ని పూర్తి చేసిన ఆయన మరో రెండు భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అందులో ఒకటి బాబి డైరెక్షన్లో కాగా మరొకటి శ్రీకాంత్ ఓదెల యాక్షన్ డ్రామా మరొకటి. బాబి డైరెక్షన్లో చేస్తున్న సినిమాని `జన నాయగన్` మేకర్, కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నారాయణ నిర్మించనున్నారు.
`అఖండ 2` ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టిన బాలయ్య వరుసగా రెండు సినిమాలని లైన్లో పెట్టేశాడు. ఒక మూవీని గోపీచంద్ మలినేనితో చేస్తున్న బాలయ్య మరో మూవీని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయబోతున్నాడు. `కురుక్షేత్రం` పేరుతో మైథాలజీని టచ్ చేస్తూ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. వరుస ఫ్లాపులతో సతమతమైన కింగ్ నాగార్జున ఇప్పుడు 100వ సినిమా కోసం భారీగా కసరత్తులు చేస్తున్నారు. దీంతో మళ్లీ ట్రాక్లోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. వెంకీ మామ కూడా ఇప్పుడు ఒకే మూవీపై దృష్టి పెట్టాడు. అదే `ఆదర్శకుటుంబం ఇంటినెం.47`. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నారు.
తమిళంలో రజనీ, కమల్ జోరు...
ఏడాదికి ఒక్కో మూవీ మాత్రమే చేసే కమల్, రజనీ జోరు చూపిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా స్పీడు పెంచేశారు. `జైలర్ 2`ని పూర్తి చేస్తున్న రజనీ..తదుపరి ప్రాజెక్ట్లు సిబి చక్రవర్తి మూవీ, కమల్తో కలిసి భారీ మల్టీస్టారర్ లు చేస్తున్నారు. వీటికి సంబంధించిన వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక కమల్ హాసన్ కూడా ఇదే తరహాలో జోరు చూపిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. `ఇండియన్ 3`ని పూర్తి చేసిన కమల్ ఇప్పుడు హెచ్. వినోద్ డైరెక్షన్లో భారీ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోంది. దీనితో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీలో రజనీతో కలిసి నటించబోతున్నారు.
మలయాళ సీనియర్స్ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. `దృశ్యం3`ని పూర్తి చేసిన మోహన్ లాల్ తన స్నేహితుడు మమ్ముట్టితో కలిసి భారీ మల్టీస్టారర్ మూవీ `పేట్రియాట్`ని కూడా రిలీజ్కి సిద్ధం చేశారు. దీనితో పాటు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇలా సీనియర్లు జూనియర్లకు మించి బిజీగా గడిపేస్తుండటంతో ఇలా ఎందుకు బిజీ బిజీగా గడిపేయాలనుకుంటున్నారు? టైమ్ ఉన్నప్పుడే చేసేది చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అనే చర్చ జరుగుతోంది.