'మైసా' కోసం రష్మిక హై రిస్క్.. ఇది కదా కమిట్మెంట్ అంటే..
ఆ ఫైట్ సీక్వెన్స్ సినిమా హైలైట్ గా నిలుస్తుందని, ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని మూవీ యూనిట్ అంచనా వేసింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి తన కమిట్మెంట్ తో హాట్ టాపిక్ గా మారారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, ఇప్పుడు మైసా సినిమా కోసం తీసుకుంటున్న రిస్క్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా సినిమా కోసం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలిసారిగా రూపొందించిన మహిళా అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడం విశేషంగా మారింది. దీంతో మైసాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ లో రష్మిక ఇప్పటివరకు చేయని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఒరిజినల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఆ చిత్రంలో ఆమె గోండు గిరిజన మహిళ పాత్రను పోషిస్తున్నారు. అందుకోసం ఫిజికల్, మెంటల్ గా ఎంతో కష్టపడినట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా సినిమాలోని కీలకమైన అండర్వాటర్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు.
ఆ ఫైట్ సీక్వెన్స్ సినిమా హైలైట్ గా నిలుస్తుందని, ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని మూవీ యూనిట్ అంచనా వేసింది. ఇండియన్ సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ రోల్ తో ఇలాంటి అండర్ వాటర్ యాక్షన్ సీన్ రూపొందించడం ఇదే తొలిసారి అని మూవీ టీమ్ పేర్కొంది. ఆ సీన్స్ కోసం రష్మిక స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ ఆధ్వర్యంలో యాక్షన్ ట్రైనింగ్ పూర్తి చేశారు.
నీటి అడుగున జరిగే క్లిష్టమైన ఫైట్ సన్నివేశాల్లో నటించడం కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. డూప్ లపై ఆధారపడకుండా సాధ్యమైనంత వరకు స్వయంగా యాక్షన్ చేయడంపై రష్మిక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైసా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నేతృత్వంలో ఒక స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేశారు.
అంతకుముందు కేరళలో జరిగిన కీలక షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ పూర్తి చేశారు. సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండటంతో త్వరలోనే టీజర్ విడుదల చేసి, సినిమా ప్రమోషన్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఆ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతున్న ఆ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు.
పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ఇప్పుడు మైసాతో పూర్తిగా భిన్నమైన యాక్షన్ ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్, రొమాంటిక్ పాత్రల్లో కనిపించిన ఆమె, ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ రోల్ ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తయిందన్న అప్డేట్ తో మైసా నార్మల్ కమర్షియల్ సినిమా కాకుండా, రష్మిక కెరీర్ లో కొత్త ఛాప్టర్ కు స్టార్ట్ చేసే మూవీగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.