బాక్సాఫీస్ బరిలోకి 'పెద్ది': ఏపీలో ప్రభుత్వ రాయితీలు.. నైజాంలో?

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా.. `ఉప్పెన` ఫేం బుచ్చిబాబు సన తెర‌కెక్కించిన ప్రతిష్టాత్మక రూరల్ యాక్షన్ డ్రామా `పెద్ది` ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది.

Update: 2026-05-29 04:49 GMT

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా.. `ఉప్పెన` ఫేం బుచ్చిబాబు సన తెర‌కెక్కించిన ప్రతిష్టాత్మక రూరల్ యాక్షన్ డ్రామా `పెద్ది` ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. చిత్రబృందం ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం 4 జూన్ 2026న ఈ భారీ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో .. మెగా అభిమానుల్లో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. `రంగస్థలం` తర్వాత చరణ్ నటిస్తున్న పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ భారీ చిత్రం విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా అభిమానులు, ప్రేక్షకులకు ఒక అదిరిపోయే తీపి కబురు అందించింది. `పెద్ది` చిత్రానికి సంబంధించి ఏపీలో స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3న‌ రాత్రి 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో సినిమా విడుదల కంటే ముందే థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా మారింది. త‌మ అభిమాన క‌థానాయ‌కుడు న‌టించిన‌ తాజా విజువల్ వండర్‌ను వెండితెరపై వీక్షించేందుకు మెగాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

టికెట్ ధరలు-షోల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో `పెద్ది` ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600 గా నిర్ణయించారు. దీనితో పాటు సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున అదనంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 5 ఆటలు ప్రదర్శించుకునేలా వెసులుబాటు కల్పించడంతో సినిమా ఎగ్జిబిట‌ర్ల‌కు, పంపిణీదారులకు భారీ కలెక్షన్లు రాబట్టేందుకు లైన్ క్లియర్ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షోలకు, మొద‌టివారం రేట్ల పెంపునకు అన్ని రకాల అనుమతులు లభించినా... పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాత్రం ప్రీమియర్ షోల నిర్వహణపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని నైజాం పరిధిలోని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మ‌రో రెండు మూడు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి స్పష్టమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని థియేటర్ల బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఓపెన్ అవుతుండటం విశేషం.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో... రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మితమైన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. `పెద్ది` మూవీ హైలైట్స్ విషయానికి వస్తే.. రామ్‌చరణ్ మేకోవర్, బుచ్చిబాబు సన మార్క్ ఎమోషనల్ విలేజ్ డ్రామా, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రామ్‌చరణ్, జాన్వీ కపూర్‌లతో పాటు జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, తిన్ను ఆనంద్ వంటి భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తుండటం ఈ ఏడాదిలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రంగా దీనిని నిలబెట్టింది.

Tags:    

Similar News