శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్..హీరో రాజశేఖర్ హుందాతనం..
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తన తాజా చిత్రం `బైకర్` (శర్వానంద్ హీరో) ప్రచారంలో వృత్తిగత వ్యక్తిగత విషయాలపై చాలా విషయాలను చర్చించిన సంగతి తెలిసిందే.;
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తన తాజా చిత్రం `బైకర్` (శర్వానంద్ హీరో) ప్రచారంలో వృత్తిగత వ్యక్తిగత విషయాలపై చాలా విషయాలను చర్చించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత విషయాలపై ప్రశ్నలకు ఆయన ఎంతో హుందాగా, నిజాయితీగా సమాధానమిస్తూ అసలైన `జెంటిల్మెన్` అనిపించుకుంటున్నారు.
పెళ్లి ప్రపోజల్ గురించిన ఒక త్రోబ్యాక్ విషయంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు రాజశేఖర్ ఎంతో హుందాగా స్పందించారు. 80లలో మేటి కథానాయిక శ్రీదేవితో పెళ్లి ప్రపోజల్ గురించి వచ్చిన ప్రచారంపై రాజశేఖర్ ని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. దివంగత నటి శ్రీదేవిపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. ``శ్రీదేవి తండ్రికి, మా నాన్నగారికి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ చొరవతో ఇరువైపులా స్నేహితుల మధ్య పెళ్లి ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆమె మన మధ్య లేరు. లేని వ్యక్తుల గురించి.. గతించిన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడటం ఏమాత్రం సరికాదు`` అని యాంకర్ను వారించి హుందాతనాన్ని ప్రదర్శించారు.
రాజశేఖర్ తన సహనటి జీవితను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట ప్రేమాయణం టాలీవుడ్లో ఒక మధుర కావ్యం. `తలంబ్రాలు`(1986) సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత కూడా ఈ జంట ఒకరికొకరు వెన్నుదన్నుగా నిలుస్తూ టాలీవుడ్ `ఐడియల్ కపుల్`గా నిలిచారు. రాజశేఖర్ నటించిన పలు సినిమాలకు జీవిత దర్శకత్వ బాధ్యతలు చేపట్టడమే కాకుండా.. ఆయన కెరీర్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు గట్టి మద్దతుగా నిలిచారు. వీరిద్దరూ కలిసి తలంబ్రాలు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో సూపర్హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అతిలోక సుందరి శ్రీదేవి ప్రముఖ హిందీ నిర్మాత బోనీకపూర్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు వారసులు ఉన్నారు. జాన్వీ, ఖుషీ సినీరంగంలో కథానాయికలుగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు.
ఈ ఆదర్శ దంపతులకు శివాని, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తూ వీరిద్దరూ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కథానాయికలుగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి దిగ్గజ నటుల సమకాలీనుడైన రాజశేఖర్.. దశాబ్ధాల కెరీర్ లో తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలతో ప్రత్యేక ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు.
నటుడిగా రాజశేఖర్ అందరికీ సుపరిచితులే అయినా.. ఆయన వృత్తిరీత్యా ఒక వైద్యుడు (ఎంబిబిఎస్ డాక్టర్) అన్న విషయం తెలిసినదే. నటనను ప్రవృత్తిగా ఎంచుకున్నప్పటికీ.. వైద్య వృత్తిపై ఆయనకున్న గౌరవం ఇప్పటికీ తగ్గలేదు. ఆపదలో ఉన్న తన సహచరులకు, ప్రజలకు వైద్య సహాయం అందించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల తన తాజా సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న రాజశేఖర్ జర్నలిస్టులతో ఎంతో ఓపికగా ముచ్చటిస్తూ తన వ్యక్తిగత, వృత్తిగత అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు.