విజయ్కి చెప్పిన కథ ఏం చేశావ్ ప్రదీప్...?
తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్. ఇతడు దర్శకుడిగా కోమలి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.;

తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్. ఇతడు దర్శకుడిగా కోమలి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా కామెడీ జర్నీ అద్భుతంగా సాగింది. సినిమాను అతడు తీసిన విధానంకు చాలా మంది ఫిదా అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల తదుపరి సినిమా కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. కాస్త ఆలస్యం అయినా కూడా మరో అద్భుతమైన సినిమాను దించాడు. లవ్ టుడే అంటూ యూత్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను తీసుకు వచ్చాడు. ఆ సినిమాతో తమిళ్లోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అందుకే ఆయనతో అన్ని భాషల ఫిల్మ్ మేకర్స్ సినిమాలను తీయాలని కోరుకుంటున్నారు.
ఇటీవల డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడిగా, హీరోగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాతో పాటు డ్యూట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు రాక ముందే ప్రదీప్ రంగనాథన్ తదుపరి సినిమా ఏంటా అనే చర్చ మొదలైంది. చాలా రోజుల క్రితం ఈ యువ దర్శకుడు సూపర్ స్టార్ విజయ్కి ఒక కథ చెప్పాడట. ఆ సమయంలోనూ మీడియాలో పుకార్లు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ప్రదీప్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఆయన సన్నిహితులు మాత్రం విజయ్కి ప్రదీప్ కథ చెప్పిన మాట వాస్తవం అన్నట్లుగా చెప్పుకొచ్చారు. విజయ్ తో ఒక మంచి ఎంటర్టైనర్ను తీయాలని ప్రదీప్ కోరుకున్నాడు. కానీ విజయ్ సినిమా ఇండస్ట్రీని వదిలేయబోతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత విజయ్ నుంచి సినిమాలు వచ్చే అవకాశం లేదు. అందుకే విజయ్ కి చెప్పిన కథను ప్రదీప్ రంగనాథ్ ఏం చేస్తాడు అనే చర్చ జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఆ కథను పట్టాలెక్కించేందుకు గాను ప్రదీప్ ప్రయత్నాలు చేస్తున్నాడని, ఆ కథతో ఏజీఎస్ బ్యానర్ భారీ సినిమాను నిర్మించేందుకు సిద్ధంగా ఉంది అంటూ తమిళ మీడియా సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ కి చెప్పిన కథను స్వల్పంగా మార్చి తానే హీరోగా స్వీయ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే నిర్మాణ సంస్థను సంప్రదించాడని తెలుస్తోంది. అప్పట్లో కూడా విజయ్ తో సినిమా అనుకున్నప్పుడు ఆ నిర్మాణ సంస్థనే ముందుకు వచ్చింది. ఇప్పటికీ ఆ కథను నిర్మించేందుకు గాను ఆ నిర్మాణ సంస్థ రెడీగా ఉంది. అందుకే ప్రదీప్ రంగనాథన్ ఆ కథను కార్యరూపం దాల్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు వచ్చిన తర్వాత అంటే ఇదే ఏడాది చివరి వరకు ప్రదీప్ కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.