ధనుష్తో 'అమరన్' రిపీట్...!
గత ఏడాది కోలీవుడ్ నుంచి వచ్చిన 'అమరన్' సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.;
గత ఏడాది కోలీవుడ్ నుంచి వచ్చిన 'అమరన్' సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన అమరన్ సినిమాను కమల్ హాసన్ నిర్మించాడు. ఈ సినిమాకు రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. ఒక బయోపిక్ ను అది కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ బయో పిక్ ను ఇంత చక్కగా, కమర్షియల్ ఎలిమెంట్స్ మరీ ఎక్కువ కాకుండా నేచురల్గా తీశాడు అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు. కేవలం తమిళ్, తెలుగు భాషల్లోనూ కాకుండా అమరన్ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు రాజ్ కుమార్ పెరియ సామి కి వరుస ఆఫర్లు వచ్చినట్లు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఆచితూచి తన తదుపరి సినిమా విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాయి పల్లవి హీరోయిన్గా..
2017లో రంగూన్ సినిమాను తీసిన రాజ్ కుమార్ పెరియసామి దాదాపు ఏడు ఏళ్ల గ్యాప్ తర్వాత 'అమరన్' సినిమాతో వచ్చాడు. తదుపరి సినిమా వెంటనే ఉంటుందని అనుకున్నప్పటికి ఆలస్యం అయింది. అమరన్ సినిమా వచ్చి ఏడాది దాటింది. అయినా ఇప్పటి వరకు ఈ దర్శకుడు కొత్త సినిమాను ప్రకటించలేదు. ఎట్టకేలకు ఈయనకు ధనుష్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందనే వార్తలు వస్తున్నాయి. ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. అమరన్ సినిమా కోసం రాజ్ కుమార్ పెరియసామి, సాయి పల్లవి కలిసి వర్క్ చేసిన విషయం తెల్సిందే. అందుకే వీరిద్దరిది హిట్ పెయిర్గా ఇప్పటికే మంచి పేరు దక్కిన విషయం తెల్సిందే.
ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో...
అమరన్ సినిమా హిట్ నేపథ్యంలో ఆ కాంబో రిపీట్ కాబోతున్న నేపథ్యంలో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. పైగా అమరన్ కాంబోతో హీరో ధనుష్ కలిస్తే మరింత గొప్పగా సినిమా ఉంటుంది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. విభిన్న చిత్రాలను తీస్తున్న దర్శకుడు రాజ్ కుమార్ మరోసారి ధనుష్ కోసం ఏకంగా ఏడాది పాటు వెయిట్ చేసి మరీ ఒక మంచి కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించి, వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ధనుష్ ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు లేకపోలేదు అని ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోసారి రౌడీ బేబీ సాంగ్ కావాలి
ఒక వైపు అమరన్ సినిమా కోసం రాజ్ కుమార్, సాయి పల్లవి కలిసి వర్క్ చేయగా, మరో వైపు మారి 2 సినిమా కోసం ధనుష్ తో కలిసి సాయి పల్లవి వర్క్ చేసిన విషయం తెల్సిందే. మారి 2 సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆ సినిమాలోని రౌడీ బేబీ పాట ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. 2018లో వచ్చిన ఆ సినిమాలోని పాట ఇప్పటికీ యూట్యూబ్తో పాటు అన్ని చోట్ల మారుమ్రోగుతూనే ఉంది. ఆ పాటలో సాయి పల్లవి డాన్స్, ధనుష్ లుక్, అన్ని కూడా భలే సెట్ కావడంతో పాట సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అలాంటిదే మరోటి పాట పడితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి దర్శకుడు రాజ్ కుమార్ పెరియాసామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి. ధనుష్ నేడు తేరే ఇష్క్ మే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరిన్ని సినిమాలు ఆయన నుంచి రాబోతున్నాయి. 2026 చివరి వరకు రాజ్ కుమార్ దర్శకత్వంలో ధనుష్, సాయి పల్లవిల మూవీ పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.