శ్రావణి ఆత్మహత్యకు కారణం అతడే..కీలక ఆధారాలు అందించిన దేవరాజ్

Update: 2020-09-11 14:00 GMT
బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ జరిగేకొద్దీ అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టిక్‌ టాక్‌ ద్వారా పరిచయమైన దేవరాజ్‌ రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఎస్‌.ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నటి ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న దేవరాజ్ పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో దేవరాజ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో మరో అనుమానితుడిగా ఉన్న సాయికృష్ణ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాయి కృష్ణ మరియు శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొడుతున్నారని శ్రావణి, తనతో మాట్లాడిన ఆడియోలు దేవరాజ్ పోలీసులకు అందించాడు. ఇందులో తన చావుకు సాయి కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడిన ఆడియో పోలీసులకు వినిపించాడు. ఈ క్రమంలో గతంలో దేవరాజ్‌ ను సాయి రక్తం వచ్చేలా కొట్టిన సాక్ష్యాలను కూడా పోలీసులకి అందించాడని తెలుస్తోంది. పోలీసుల విచారణలో సాయి గురించి దేవరాజ్ సంచలన విషయాలు బయట పెట్టాడు. సాయికృష్ణ అనే వ్యక్తి కృష్ణా నగర్‌ లో ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ట్రాప్ చేస్తుంటాడని.. అలానే శ్రావణిని సైతం ట్రాప్ చేశాడని వెల్లడించాడు. దేవరాజ్‌ తో విడిపోవాలంటూ శ్రావణిని సాయి వేధింపులకు గురి చేశాడని.. అతని వేదింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు దేవరాజ్ తెలిపినట్లు సమాచారం. ఇక ఈ కేసులో 'ఆర్‌ఎక్స్‌100' సినిమా నిర్మాత అశోక్‌ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News