విక్రమ్‌ ఓ కిలాడి అంటోంది

Update: 2015-07-03 11:30 GMT
నిత్యా మీనన్‌ ఎంత మంచి నటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇటు తెలుగులో, అటు తమిళంలో.. మరోవైపు తన మాతృభాష మలయాళంలో అద్భుతమైన పాత్రలు పోషించి.. తన నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసింది. మణిరత్నం లాంటి గ్రేట్‌ డైరెక్టర్‌ కూడా నిత్య టాలెంట్‌ చూసి పడిపోయాడు. 'ఓకే బంగారం'లో ఆమెకు లీడ్‌ రోల్‌ ఇచ్చాడు. ఆయన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నటించి మెప్పించింది నిత్య. ఇంతకీ నటిగా ఇంత మంచి పేరు తెచ్చుకున్న నిత్యకు ఎవరు నటనంటే ఇష్టం? ఎవరిలా నటించాలని ఆమె కోరుకుంటుంది?.. ఇదే ప్రశ్నల్ని ఆమె ముందుంచితే.. ''నాకు విక్రమ్‌ సార్‌ అంటే చాలా ఇష్టం. నటన కోసం అంతలా అంకితమయ్యే నటుణ్ని ఎక్కడా చూడలేదు. పాత్రగా మారడంలో ఆయన కిల్లాడి. విక్రమ్‌లా నటించాలన్నది నా కోరిక'' అని చెప్పింది నిత్య.

నాలుగు భాషల్లో నటిస్తున్నారు కదా.. భాష విషయంలో ఇబ్బందేమీ రాలేదా అని నిత్యను అడిగితే.. ''నిజం చెప్పాలంటే నాకు నా మాతృభాష మలయాళమే సరిగా రాదు. ఆ భాష మాట్లాడుతున్నపుడే తడబడుతుంటాను. చాలా ఏళ్లు బెంగళూరులో ఉండటం వల్ల తమిళం, కన్నడ ఫ్లూయెంట్‌గా మాట్లాడతాను. తెలుగు, మలయాళమే సరిగా రావు. కానీ రాను రాను అన్ని భాషలమీదా పట్టు చిక్కింది. ఎలాంటి ఇబ్బందీ లేదు'' అని చెప్పింది. దర్శకత్వం గురించి ఇంకా ఆలోచించలేదని.. ఐతే కథలు మాత్రం రాస్తుంటానని.. ఇప్పుడు చేతినిండా సినిమాలు ఉన్నాయని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని చెప్పింది నిత్య.

Tags:    

Similar News