'గుంజన్ సక్సేనా' గా జాన్వీ మెప్పించిందా...?

Update: 2020-08-13 12:30 GMT
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ తొలి మహిళా పైలట్ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌ లో ''గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'' అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరణ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ బయోపిక్ ని కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ - జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. 1999లో జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని.. యుద్ధంలో గాయ‌ప‌డిన సైనికుల‌ను ర‌క్షించ‌డంలో గుంజన్‌ సక్సేనా కీల‌క పాత్ర పోషించారు. అందుకే కార్గిల్ లో ఆమె చేసిన సేవ‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం శౌర్య వీర్ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. ఇప్పుడు అలాంటి బరువైన పాత్రలో కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న జాన్వీ కపూర్ నటించింది.

కాగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటనకు మిశ్రమ స్పందన వచ్చింది. గుంజన్ సక్సేనా భారత పైలట్ అయ్యే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు అవమానాలను ఎదుర్కొంది.. ఎంతగా పోరాటం చేసింది.. కార్గిల్ యుద్ధ సమయంలో ఎలా పోరాడింది అనే ఇతి వృత్తంలో ఈ చిత్రం తెరకెక్కింది. సన్నివేశాలకి తగ్గట్టు ఎక్సప్రెషన్స్ ఇవ్వలేకపోయిందని.. అన్ని సీన్స్ కి ఒకటే ఎక్సప్రెషన్స్ ఇచ్చిందని కూడా విమర్శలు వచ్చాయి. బయోపిక్ కావడం వల్ల జాన్వీ కపూర్ చుట్టూనే కథ తిరగడంతో అందరూ ఆమె యాక్టింగ్ పై ఫోకస్ పెట్టారు. జాన్వీ ఇంకా పరిపూర్ణ నటి కాదనే విషయం అందరికి తెలిసిందే. అయితే గుంజన్‍ సక్సేనా పాత్రకు కావాల్సిన అమాయకపు లక్షణాలు ఉన్న ఈ పాత్రకు జాన్వీ బాగా సూట్‍ అయిందనే కామెంట్స్ వచ్చాయి. మూవీ స్టార్టింగ్ లో ఆమె నటన మందగించినట్లు అనిపించినా.. క్లైమాక్స్ లో అద్భుతంగా నటించిందనే చెప్పుకోవాలి. మొత్తం మీద గుంజన్‌ సక్సేనా గా అక్కడక్కడా తడబడినప్పటికీ జాన్వీ మెప్పించిందనే ఓటీటీ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News