వైరల్: జగన్ గురించి ఆరాతీసిన మహేష్ బాబు

Update: 2020-05-25 06:00 GMT
ఏపీ సీఎం జగన్.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. భిన్న ధృవాలు.. రాజకీయాలే లోకంగా జగన్ ఉంటారు. సినిమానే ప్రాణంగా మహేష్ బాబు ఉంటారు. రాజకీయాలపై తనకు అస్సలు అవగాహన లేదని.. తన కొడుకు గౌతమ్ కు తెలిసినంత కూడా రాజకీయాల గురించి తనకు తెలియదని ఆ మధ్య మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. అలాంటి మహేష్ ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి అడిగాడు.. ఆరా తీశాడు. తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఇదిప్పుడు వైరల్ అయ్యింది.

ఏపీ సీఎం జగన్ పాలనకు ఏడాది పూర్తయ్యింది. వైసీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సందర్భంగా నటుడు పోసాని కృష్ణ మురళి కూడా జగన్ పాలనను కొనియాడారు. తాజాగా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో జగన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబును ఓడించి జగన్ గెలుస్తాడని సినీ ఇండస్ట్రీలో ఎవరూ నమ్మలేదని.. బెట్లు కూడా కాశారని చెప్పుకొచ్చాడు. ఫలితాలకు ముందు తనకు, మహేష్ బాబుకు మధ్య జరిగిన సంభాషణను కూడా పోసాని పంచుకున్నాడు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ గురించి.. ఆయన గెలుపు అవకాశాల గురించి మహేష్ బాబు స్వయంగా పోసానిని అడిగారట.. ఎటువంటి సంకోచం లేకుండా జగన్ గెలుస్తాడని తాను మహేష్ కు చెప్పినట్టు పోసాని వివరించాడు.

 అయితే చంద్రబాబు పసుపు కుంకుమ సహా వివిధ పథకాల ద్వారా చంద్రబాబు రూ.10వేలు, 12వేలు అంటూ డబ్బులు పంచుతున్నాడు కదా జగన్ గెలుస్తాడా అని మహేష్ అడిగాడని పోసాని తెలిపారు. ‘బాబు.. ప్రజలు తెలివైన వారని.. జగన్ నే గెలిపిస్తారని’ తాను మహేష్ కు చెప్పినట్టు పోసాని వివరించాడు. ఇలా జగన్ గెలుపు గురించి మహేష్ బాబు సైతం ఆరాతీశాడని తెలియడంతో అదిప్పుడు తెలుగునాట వైరల్ అయ్యింది.
Tags:    

Similar News