అఖిల్‌ 5 : హీరోయిన్‌ విషయంలోనూ చరణ్‌ సలహా

Update: 2020-09-12 05:30 GMT
అక్కినేని హీరో అఖిల్‌ 5వ సినిమా ఇటీవలే కన్ఫర్మ్‌ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి ఆ కాంబోను సెట్‌ చేసింది మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అంటూ బలంగా ప్రచారం జరుగుతోంది. అఖిల్‌ కు ఒక మంచి సక్సెస్‌ ఇవ్వాలనే పట్టుదలతో చరణ్‌ తన వద్దకు సూరి తీసుకు వచ్చిన కథను పంపించాడని అలాగే నిర్మాత అనిల్‌ సుంకరను ఆ ప్రాజెక్ట్‌ కు నిర్మాతగా ఉండాలని కూడా సూచించాడట. ఈ మొత్తం వ్యవహారం చరణ్‌ నడిపిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలకు తోడు మరో వార్త కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అఖిల్‌.. సూరిల కాంబో మూవీకి రష్మిక మందన్నా ను హీరోయిన్‌ గా ఎంపిక చేయాలనే సలహాను కూడా రామ్‌ చరణ్‌ ఇచ్చాడట. ప్రస్తుతం రష్మీక లక్కీ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. నితిన్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాప్‌ లతో సతమతం అవుతున్న సమయంలో భీష్మ సినిమాను చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో రష్మిక హీరోయిన్‌ గా నటించింది. ఈ ఏడాదిలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా సక్సెస్‌ దక్కించుకుంది. రష్మిక ఉంటే సినిమాకు క్రేజ్‌ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో చరణ్‌ ఆమె పేరును సూచించాడట.

రామ్‌ చరణ్‌ గతంలో పలు సందర్బాల్లో అఖిల్‌ ను తమ్ముడు అంటూ చెప్పిన విషయం తెల్సిందే. అందుకే అఖిల్‌ సక్సెస్‌ కోసం చరణ్‌ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే కథ.. దర్శకుడు.. హీరోయిన్‌ ఇలా అఖిల్‌ 5 విషయంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ అటు అక్కినేని ఫ్యాన్స్‌ మరియు మెగా ఫ్యాన్స్‌ తో పాటు ఇటు సినీ వర్గాల వారు కూడా గుసగుసలాడుకుంటున్నారు. రష్మిక 'ఆచార్య'లో చరణ్‌ కు జోడీగా కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Tags:    

Similar News