ప్ర‌తిదానికీ ఫిల్మిండ‌స్ట్రీనే టార్గెట్ చేయ‌డం త‌గ‌ద‌‌న్న బ్యూటీ

Update: 2020-09-10 08:50 GMT
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం కొంప‌లంటిస్తోంది. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి డ్ర‌గ్స్ లింకుల‌తో అగ్గి రాజేస్తోంది. సుశాంత్ సింగ్ టాపిక్ సైడైపోగా.. ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ తీగ మొత్తం ప‌ట్టుకుని డొంకంతా లాగేస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ముఖ్యంగా బాలీవుడ్ శాండ‌ల్వుడ్ స‌హా ప‌లు ఇండ‌స్ట్రీల‌తో ముడిప‌డిన డ్రగ్స్ రాకెట్ గుట్టు మ‌ట్లు ప‌ట్టుకుని లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ స‌హా శాండ‌ల్వుడ్ లో ప‌రిస్థితి చూస్తుంటే అట్టుడికిపోతోంది.

అయితే ప్ర‌తిదానికి సినిమావాళ్ల‌నే అన‌డం చాలామందికి న‌చ్చ‌డం లేదు. అందులో హైద‌రాబాదీ అమ్మాయి అదితీరావ్ హైద‌రీ కూడా ఉంది. తాజా ఇంటర్వ్యూలో అదితీ రావు సినీ పరిశ్రమకు దాపురించిన తాజా పరిస్థితుల గురించి విచారం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమ సాఫ్ట్ కార్న‌ర్ గా మారడం విచారకరం అని ఆవేద‌న‌ను వ్యక్తం చేసింది అదితీ.

``మేం ఎవ‌రైనా సంబంధిత సమస్య గురించి మాట్లాడితే అందులో ఒక తప్పు పదం దొరికినా వెంట‌నే టార్గెట్ అయిపోతాం.  ప్రతి ఒక్కరూ త‌ప్పు మాట్లాడిన‌వారిపై  బౌన్స్ అవుతారు. అలాగ‌ని మాట్లాడకపోతే ప్రతి ఒక్కరూ బ‌ల‌వుతారు. ప్రతిదానికి చిత్ర పరిశ్రమనే బ‌లి చేస్తారా? ఇది సరైంది కాదు`` అంటూ అదితీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. మహమ్మారి సమయంలో కూడా ప్రజలకోసం చాలా మంది తారలు చాలా మంచి పనులు చేస్తున్నారని తెలిపింది. మంచిని దాచి చెడును ప్రతికూలత‌ను హైలైట్ చేస్తున్నారు. ప్రజలు దాని గురించి మాత్రమే మాట్లాడుతారు. అంద‌రూ ప్రతికూలంగా కాకుండా సానుకూలతపై ఎక్కువ దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను`` అని అదితీ అన్నారు. అన్న‌ట్టు అదితీరావ్ న‌టించిన వి ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. మిక్స్ డ్ టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌లు క్రేజీ చిత్రాల్లో అదితీ న‌టిస్తోంది.
Tags:    

Similar News