Begin typing your search above and press return to search.

ఇంగ్లండ్‌పై చెలరేగిన వైభవ్‌ సూర్యవంశీ..టీమ్‌ఇండియాలోకి వచ్చేస్తాడా?

వైభవ్‌ సూర్యవంశీది ఈ ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీగా చెబుతున్నారు. కేవలం 52 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   5 July 2025 9:52 PM IST
ఇంగ్లండ్‌పై చెలరేగిన వైభవ్‌ సూర్యవంశీ..టీమ్‌ఇండియాలోకి వచ్చేస్తాడా?
X

ఇంగ్లండ్‌లోని పరిస్థితుల్లో బ్యాటింగ్‌ అంత ఈజీ కాదు.. బాల్‌ స్వింగ్‌ అవుతూ బ్యాట్స్‌మన్‌కు పరీక్ష పెడుతుంది. కొన్నిసార్లు లోపలకు వస్తుంది.. మరికొన్నిసార్లు బయటకు వెళ్తుంటుంది.. అలాంటిచోట విరాట్‌కోహ్లి లాంటి దిగ్గజమే కిందామీద పడ్డాడు. కానీ, 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ మాత్రం దుమ్మురేపుతున్నాడు. హాఫ్‌ సెంచరీలు, సెంచరీలు సులువుగా చేసేస్తున్నాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో సంచలనం ఎవరంటే వైభవ్‌ సూర్యవంశీనే. 1.20 కోట్లకు ఇతడిని రాజస్థాన్‌ రాయల్స్‌ కొన్నప్పుడు తుది జట్టులో ఆడిస్తారని ఎవరూ భావించలేదు. కానీ, అనూహ్యంగా అవకాశం రావడం.. అతడు మెరుపు సెంచరీ (35 బంతుల్లో) చేయడం.. ఆ తర్వాత కూడా మంచి ఇన్నింగ్స్‌లు ఆడడంతో 14 ఏళ్లకే సూపర్‌ స్టార్‌ అయిపోయాడు.

సహజంగా అకాడమీలకు వెళ్లే వయసులో వైభవ్‌.. అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఆ దేశం అండర్‌ 19 జట్టుతో భారత అండర్‌ 19 జట్టు యూత్‌ వన్డే సిరీస్‌ ఆడుతోంది. ఐపీఎల్‌ ప్రదర్శనతో వైభవ్‌ను ఈ టోర్నీకి ఎంపిక చేశారు. 48, 45, 86... ఇవీ వరుసగా మూడు మ్యాచ్‌లలో అతడి స్కోర్లు. తాజాగా నాలుగో వన్డేలో మరింత చెలరేగాడు. ఏకంగా 143 పరుగులు చేశాడు. 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సులతో ఈ స్కోరు సాధించాడు. వైభవ్‌ దూకుడుతో పాటు విహాన్‌ మల్హోత్రా (129) కూడా సెంచరీ సాధించడంతో యువ టీమ్‌ ఇండియా ఈ మ్యాచ్‌లో 363 పరుగుల భారీ స్కోరు చేసింది.

వైభవ్‌ సూర్యవంశీది ఈ ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీగా చెబుతున్నారు. కేవలం 52 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. కాగా, వైభవ్‌ ఇదే జోరు కొనసాగిస్తే.. 14 లేదా 15 ఏళ్లకే టీమ్‌ ఇండియాలోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ 16 ఏళ్ల వయసుకే భారత్‌కు ఆడిన రికార్డును చెరిపేస్తాడు. వైభవ్‌ మరింత వైభవంగా వెలగాలని దీవిద్దాం...