గుంటూరు కుర్రాడి ఆట ఘాటెక్కువే.. టెస్టులకే కాదు ఐపీఎల్ కూ పర్ఫెక్ట్!
చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ మొత్తానికే దూరం కావడం, మరో ఓపెనర్ కాన్వే స్ట్రయిక్ రేట్ సరిగా లేకపోవడంతో రషీద్ ను ఆడించింది ఫ్రాంచైజీ యాజమాన్యం.
By: Tupaki Desk | 16 April 2025 3:45 AM18 సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో తెలుగు కుర్రాడు తళుక్కుమన్నాడు. కాకినాడకు చెందిన పేసర్ సత్యనారాయణ రాజు ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కు ఆడుతుండగా.. గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ తాజాగా ఐదుసార్లు చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరిశాడు. లీగ్ లో ఇప్పటికే ముంబైకి తిలక్ వర్మ, సన్ రైజర్స్ హైదరాబాద్ కు నితీశ్ కుమార్ రెడ్డి, గుజరాత్ టైటాన్స్ కు మొహమ్మద్ సిరాజ్ ఆడుతున్నారు.
సత్యనారాయణ కొన్ని రోజుల కిందటే ముంబై తరఫున ఎంట్రీ ఇచ్చాడు. కానీ, రషీద్ కు మాత్రం సోమవారం అవకాశం దక్కింది. అయితే, అది కూడా పరిస్థితుల కారణంగానే. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ మొత్తానికే దూరం కావడం, మరో ఓపెనర్ కాన్వే స్ట్రయిక్ రేట్ సరిగా లేకపోవడంతో రషీద్ ను ఆడించింది ఫ్రాంచైజీ యాజమాన్యం.
వాస్తవానికి రషీద్ టెక్నికల్ గా మంచి సౌండ్. అతడి బ్యాటింగ్ స్టయిల్ టెస్టులకు సరిపోతుందని.. టీమ్ ఇండియాకు టెస్టుల్లో ఆడతాడని అంచనా వేశారు. అండర్ 19 ప్రపంచ కప్ సెమీస్, ఫైనల్స్ లో రషీద్ హాఫ్ సెంచరీలు చేసినప్పుడు అందరూ అతడి గురించి చెప్పుకొన్నారు. కానీ, తర్వాత పెద్దగా వార్తల్లో లేడు.
ఈ సీజన్ కు రషీద్ ను రూ.30 లక్షలకు తీసుకుంది చెన్నై. రుతురాజ్ లేకపోవడం, కాన్వేను పక్కనపెట్టడంతో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో అవకాశం ఇచ్చింది. దీంతో ఐపీఎల్ లో సీఎస్కే తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా (20 ఏళ్ల 202 రోజులు) నిలిచాడు. 2020 సీజన్ లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్ 22 ఏళ్ల 132 రోజుల వయస్సులో ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు.
ఇక రషీద్ బ్యాటింగ్ తీరు అచ్చం వారి కెప్టెన్ రుతురాజ్ ను పోలి ఉందని కామెంటేటర్లు పేర్కొన్నారు. మ్యాచ్ లో 19 బంతులు ఆడిన అతడు 6 ఫోర్లు కొట్టాడు. 27 పరుగులు చేసి ఔటయ్యాడు. రషీద్ ఆడిన షాట్లన్నీ పక్కా క్రికెటింగ్ షాట్లే. అతడి టెక్నిక్ కు వంకపెట్టే పనిలేదు.
మొన్నటివరకు టెస్టులకు పనికొస్తాడని భావించినా.. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ లోనూ రషీద్ రాణించగలనని నిరూపించాడు.
ధోనీ చేతిలో పడితే..
చెన్నైకు ఈ సీజన్ లో మిగతా మ్యాచ్ లకు కెప్టెన్ గా దిగ్గజ ఆటగాడు ధోనీ సారథ్యం వహించనున్నాడు. రషీద్ ఇప్పటికే తన టాలెంట్ చూపాడు. యువకులను బాగా ప్రెత్సహించే ధోనీ దగ్గర ఉండడం ఈ గుంటూరు కుర్రాడికి చాలా మేలు చేయడం ఖాయం.
కొసమెరుపు: ధోనీ టీమ్ ఇండియాకు 2004 అక్టోబరు-నవంబరులో ఎంపికయ్యాడు. సరిగ్గా అప్పుడే పుట్టాడు షేక్ రషీద్.