Begin typing your search above and press return to search.

అప్పుడు రాహుల్.. ఇప్పుడు పంత్.. తదుపరి గోయెంకా ఒత్తిడికి బలికాబోయే ఆ ‘నెక్స్ట్ కెప్టెన్’ ఎవరు?

అయితే ఈ జట్టు సాధించే విజయాల కంటే.. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ప్రవర్తన, నిర్ణయాలే ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి.

By:  A.N.Kumar   |   30 May 2026 12:13 PM IST
అప్పుడు రాహుల్.. ఇప్పుడు పంత్.. తదుపరి గోయెంకా ఒత్తిడికి బలికాబోయే ఆ ‘నెక్స్ట్ కెప్టెన్’ ఎవరు?
X

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వార్తల్లో నిలుస్తూ, నిరంతరం చర్చనీయాంశంగా మారుతున్న ఫ్రాంచైజీల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్.ఎస్.జీ) ఒకటి. అయితే ఈ జట్టు సాధించే విజయాల కంటే.. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ప్రవర్తన, నిర్ణయాలే ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. గత ఏడాది కేఎల్ రాహుల్.. నేడు రిషభ్ పంత్.. ఇలా వరుసగా ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లక్నో కెప్టెన్సీకి దూరం కావడం వెనుక గోయెంకా ఒత్తిడే కారణమా? అనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కేఎల్ రాహుల్ నిష్క్రమణ.. ఆ చేదు జ్ఞాపకమే కారణమా?

2024 ఐపీఎల్ సీజన్ లక్నో ఫ్రాంచైజీలో పెద్ద చీలికకు దారితీసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో లక్నో ఘోర పరాజయం పాలైన తర్వాత, మైదానంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందూ తీవ్రంగా మందలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఫ్రాంచైజీ యజమాని ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ అవమానం భరించలేకే కేఎల్ రాహుల్ లక్నో జట్టును వీడి ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడనే ప్రచారం జరిగింది. దీనిపై రాహుల్ నేరుగా స్పందించకపోయినప్పటికీ గోయెంకాతో వచ్చిన విభేదాల వల్లే అతడు జట్టును వీడాడనేది జగమెరిగిన సత్యం.

రూ. 27 కోట్ల పంత్.. ధోనీ రేంజ్ అంచనాలు!

రాహుల్ వెళ్లిపోయాక, లక్నో యాజమాన్యం మెగా వేలంలో భారీ మొత్తాన్ని వెచ్చించింది. రికార్డు స్థాయిలో రూ. 27 కోట్లు పెట్టి రిషభ్ పంత్‌ను దక్కించుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఆ సమయంలో గోయెంకా పంత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "పంత్ భవిష్యత్తులో లక్నోకు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందిస్తాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలుస్తాడు" అని గోయెంకా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పుడు పంత్ వంతు.. ఒత్తిడే కారణమా?

అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన పంత్ సారథ్యంలోని లక్నో జట్టు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. అటు జట్టు పరాజయాలు, ఇటు పంత్ వ్యక్తిగత ఫామ్ నిరాశపరచడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం పంత్ లక్నో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో క్రికెట్ విశ్లేషకులు మళ్లీ గోయెంకా వైపే వేలెత్తి చూపిస్తున్నారు. మేనేజ్‌మెంట్ నుంచి వచ్చే విపరీతమైన ఒత్తిడి.,, ప్రతి సీజన్‌లో టైటిల్ గెలవాలనే ఓనర్స్ ఒత్తిడి కెప్టెన్లపై భారం పడుతోంది. మైదానంలో కెప్టెన్లకు నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ లభించడం లేదనే టాక్ వినిపిస్తోంది.

నిజంగానే గోయెంకా ఒత్తిడి ఉందా?

రిషభ్ పంత్ కెప్టెన్సీ వదులుకోవడానికి సంజీవ్ గోయెంకానే ప్రత్యక్ష కారణమని చెప్పడానికి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు. బహుశా వరుస వైఫల్యాల వల్ల పంత్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ లక్నో ఫ్రాంచైజీ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే అభిమానులకు అనుమానాలు రాక మానవు. వరుసగా ఇద్దరు టాప్ ఇండియన్ వికెట్ కీపర్-బ్యాటర్లు (రాహుల్, పంత్) ఈ ఫ్రాంచైజీలో ఇమడలేకపోవడం యాజమాన్య నిర్వహణ తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ప్రస్తుతానికైతే లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ కొత్త కెప్టెన్ వేటలో పడింది. రాబోయే సీజన్‌లో కొత్త సారథితో ఈ జట్టు ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. అయితే, సోషల్ మీడియాలో మాత్రం ఒకటే ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది: "అప్పుడు రాహుల్.. ఇప్పుడు పంత్.. తదుపరి గోయెంకా ఒత్తిడికి బలికాబోయే ఆ ‘నెక్స్ట్ కెప్టెన్’ ఎవరు?" అని ట్రోల్స్ మొదలయ్యాయి.