రోహిత్ శర్మ.. సూపర్ ఫిట్ నెస్.. 2027 ప్రపంచకప్ ఖాయం
శరీర స్వభావం రీత్యా కాస్త బొద్దుగా కనిపించే టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఫిట్ నెస్ కోల్పోయినట్లు కనిపించాడు.
By: Tupaki Desk | 2 Sept 2025 9:00 PM ISTశరీర స్వభావం రీత్యా కాస్త బొద్దుగా కనిపించే టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఫిట్ నెస్ కోల్పోయినట్లు కనిపించాడు. ఆపై టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 2024 టి20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఈ ఫార్మాట్ కూ గుడ్ బై చెప్పాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన జట్టుకు అతడే కెప్టెన్ కూడా.
షేప్ ఔట్ అయి...
రోహిత్.. చివరిగా క్రికెట్ ఆడింది ఐపీఎల్ లోనే. అదీ జూన్ 1న. అంటే మూడు నెలలు దాటిపోయింది. ఐపీఎల్ లోనూ కొన్ని మ్యాచ్ లలో రోహిత్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపారు. ఫామ్ తో పాటు ఫిట్ నెస్ దీనికి కారణంగా చెప్పొచ్చు. ఈ మధ్యలోనే కుటుంబంతో ఇంగ్లండ్ వెళ్లిన రోహిత్... వింబుల్డన్, టెస్టు సిరీస్ మ్యాచ్ లను చూశాడు. అయితే, అతడు తిరిగి వచ్చాక ఎయిర్ పోర్ట్ లో చూస్తే అసలు ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలోనే కనిపించలేదు. శరీరంపై అదుపు కోల్పోయాడా? అన్నట్లు అనిపించింది. కానీ, ఇప్పుడు మాత్రం రోహిత్ ను చూస్తే కెరీర్ మొదట్లో కంటే ఫిట్ గా కనిపిస్తున్నాడు.
సూపర్ ఫిట్ గా..
అత్యంత కఠినంగా భావించే యోయో ఫిట్ నెస్ టెస్టును మించినదిగా చెబుతున్న బ్రాంకో టెస్టులోనూ రోహిత్ పాసయ్యాడు. దీంతో రోహిత్ ను వచ్చే ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక చేయడం అనేది సెలక్టర్ల చేతిలో ఉంది. అసలు రోహిత్ కేవలం వన్డేల్లో కొనసాగుతున్నది 2027 ప్రపంచకప్ కోసం అని కథనాలు వస్తున్నాయి. ఆ టోర్నీలోనూ జట్టును నడిపించాలని రోహిత్ భావిస్తున్నాడట. బహుశా అందుకేనేమో..సూపర్ ఫిట్ నెస్ సాధించాడు.
ఆ ఫొటో.. ఈ ఫొటో...
రోహిత్ ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా కాస్త పొట్టతో, బొద్దుగా ఉన్న ఫొటోను, ఇప్పుడు సూపర్ ఫిట్ నెస్ సాధించిన ఫొటోను పక్కపక్కన పెట్టి చూస్తే భారీగా ట్రాన్స్ ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. భారత్ లో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో వన్డే సిరీస్ కూడా ఆడతాడట. అందుకే ముందుగానే ఫిట్ నెస్ టెస్టుకు హాజరయ్యాడని తెలుస్తోంది. ఆసీస్ ఏతో సిరీస్ లోనూ తన ఫామ్ నిరూపించుకునే ఆస్ట్రేలియా టూర్ కు అతడే కెప్టెన్. కోరుకున్నంత కాలం వన్డే టీమ్ లోనూ కొనసాగుతాడని చెప్పాల్సిన అవసరం లేదు.
