17 ఏళ్ల రికార్డు బద్దలు: చెపాక్లో చెన్నైపై చివరకు విజయం సాధించిన RCB!
చెన్నై ఎల్లో జర్సీలను స్టేడియంలో కిక్కురమనకుండా మూడీగా కూర్చుండబెట్టాడు. 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఈ విజయం ఇప్పుడో చిరస్మరణీయంగా చెప్పొచ్చు
By: Tupaki Desk | 29 March 2025 4:25 AMఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6155 రోజులు తర్వాత దక్కిన విజయం.. అప్పుడెప్పుడో 2008లో రాహుల్ ద్రావిడ్, కుంబ్లే, కోహ్లీల ఆర్సీబీ టీం తొలి ఐపీఎల్ లో చెన్నై చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. ఈ 17 ఏళ్లలో ఒక్కసారి కూడా అక్కడ బెంగళూరు జట్టు విజయం సాధించలేదు. కానీ కొత్త కెప్టెన్ రజత్ పటీదార్ చెన్నై మెడలు వంచాడు. భీకర ధోని జట్టును వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించాడు. చెన్నై ఎల్లో జర్సీలను స్టేడియంలో కిక్కురమనకుండా మూడీగా కూర్చుండబెట్టాడు. 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన ఈ విజయం ఇప్పుడో చిరస్మరణీయంగా చెప్పొచ్చు.
ఐపీఎల్ చరిత్రలో ఎంతోకాలంగా ఉన్న ఒక రికార్డు నిన్న రాత్రి బద్దలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ను వారి సొంత మైదానంలో ఓడించి చరిత్ర సృష్టించింది. 2008 నుండి RCB చెన్నైని చెపాక్లో ఓడించడం ఇదే మొదటిసారి.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివరి ఓవర్లో టిమ్ డేవిడ్ విధ్వంసకరమైన బ్యాటింగ్తో చెలరేగడంతో ఈ స్కోరు సాధ్యమైంది. అయితే, ఈ చెన్నై ఈవెంట్లో వారి చేజింగ్ లో స్థిరమైన భాగస్వామ్యాలు లేకపోవడంతో ఎక్కడా నిలవలేకపోయారు.
ధోని చివరిలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ అది ఏమాత్రం సరిపోలేదు. అతను కేవలం 16 బంతుల్లో 30 పరుగులు చేసినప్పటికీ, అది ఆటపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చివరికి, బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నైని ఓడించింది.
చెన్నై సూపర్ కింగ్స్పై 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడంతో బెంగళూరు సంబరాలు చేసుకునేందుకు ఒక కారణం ఉంది. అయితే, హెడ్-టు-హెడ్ రికార్డు మాత్రం ఇప్పటికీ చెన్నై వైపే బలంగా ఉంది. చెన్నై 21 మ్యాచ్ల్లో బెంగళూరును ఓడించగా, బెంగళూరు కేవలం 12 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది.
ఈ సీజన్ లో RCB వరుసగా టోర్నమెంట్లో మొదటి రెండు మ్యాచ్లను గెలవడం ద్వారా ఐపీఎల్ లో మంచి ఆరంభాన్ని పొందారు. కానీ సంవత్సరాలుగా RCBతో ఉన్న సమస్య ఏమిటంటే, వారు బలంగా ప్రారంభిస్తారు, కానీ తరువాత దారి తప్పుతారు. ఈ సంవత్సరం వారు స్థిరత్వాన్ని కొనసాగించగలరా లేదా చూడాలి.