ప్రొ కబడ్డీ.. కబడ్డీ.. కొత్త కూత...
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు కబడ్డీ మ్యాచ్ లకు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో వరుసగా సీజన్లు ముగిశాయి. పదేళ్ల తర్వాత చూస్తే..ఆదరణ తగ్గుతోందని తేలింది.
By: Tupaki Desk | 29 Aug 2025 5:48 PM ISTక్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)... బ్యాడ్మింటన్ లో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)... ఇలా ఫేమస్ గేమ్స్ కు ఇండియాలో ప్రత్యేకించి లీగ్ లు ఉన్నాయి...వీటికి ఆదరణ కూడా అంతే స్థాయిలో ఉంది..! ఇలాంటి నేపథ్యంలోనే పుట్టుకొచ్చింది ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్). భారత గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి దేశంలో ఇంత ఆదరణ ఉందా? అన్నట్లుగా... అప్పటిదాక ఎవరూ ఊహించని కూడా ఊహించని విధంగా క్లిక్ అయింది ప్రొ కబడ్డీ లీగ్. 2014లో ప్రారంభమైన ఈ లీగ్ తొలి నాళ్లలో విపరీతమైన ఆదరణ చూరగొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు కబడ్డీ మ్యాచ్ లకు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో వరుసగా సీజన్లు ముగిశాయి. పదేళ్ల తర్వాత చూస్తే..ఆదరణ తగ్గుతోందని తేలింది.
తెలుగు వారు లేకనా?
ప్రొ కబడ్డీ లీగ్ సక్సెస్ స్థాయి ఏమిటో చెప్పాలంటే.. ఐపీఎల్ తో పోల్చి చూడాలి. ఐపీఎల్ మ్యాచ్ లను చూసినట్లే ఈ లీగ్ నూ ఆదరించారు. సహజంగానే ఇందులో తెలుగువారి పాత్ర అధికం అని చెబుతుంటారు. అయితే, మనదగ్గర క్రమంగా వ్యూయర్ షిప్ పడిపోసాగింది. ఉత్తర భారత దేశంలో మాత్రం నిలకడగా ఉంది. ఎక్కువ శాతం తెలుగు ఆటగాళ్లు లేకపోవడం తెలుగు వారి ఆదరణ తగ్గడానికి కారణం ఏమో?
కొత్త కూతతో.. పోటీకి తొడగొడుతూ...
ఎప్పుడైనా కాలానికి తగ్గట్లు మారాల్సిందే. అందులోభాగంగానే ప్రొ కబడ్డీ లీగ్ నిర్వాహకులు మళ్లీ వ్యూయర్ షిప్ పెంచే చర్యలు చేపడుతున్నారు. ఇదివరకటి సాధారణ పాయింట్ల పద్ధతి కాకుండా టై మ్యాచ్ లకు షూటౌట్ రైడ్స్, గోల్డెన్ రైడ్ వంటివి అమల్లోకి తేనున్నారు. ఫలితం డ్రాగా మిగలకుండా ఫలితం తేల్చేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆట రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు.
తొలి మ్యాచ్ లో తెలుగు వీరులు..
12వ సీజన్ లో 12 జట్లు బరిలో ఉన్నాయి. తొలి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ -తమిళ్ తలైవాస్ తలపడనున్నాయి. శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆటగాళ్లను ప్రత్యేకంగా సన్మానించి.. ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. విశాఖ నుంచి జైపూర్, చెన్నై, ఢిల్లీలలో మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం 108 మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
గెలిస్తే 2.. ఓడితే 0.. ప్లే ఇన్ మ్యాచ్ లు
-కొత్త పాయింట్ల విధానం ప్రకారం విజేత జట్టుకు 2, ఓడిపోయిన జట్టుకు సున్నా పాయింట్లు లభిస్తాయి. ఇది ప్రేక్షకులు స్టాండింగ్స్ ను సులభంగా ఫాలో అయ్యేందుకు తోడ్పడుతుందని లీగ్ నిర్వాహకులు చెబుతున్నారు.
-ప్రస్తుత సీజన్ లో తొలిసారి ప్లే ఇన్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. లీగ్ దశలో టాప్ -8 జట్లు ప్లే ఆఫ్స్ చేరతాయి.
-5 నుంచి 8వ స్థానాల్లో ఉన్న జట్లు ప్లే ఇన్ మ్యాచ్ లు ఆడతాయి. విజేతలు ఎలిమినేటర్లకు వెళ్తారు.
-3,4 స్థానాల్లో ఉన్న జట్లు మినీ క్వాలిఫయర్స్ ఆడతాయి. ఓడిన జట్టుకు ఎలిమినేటర్ లో తలపడుతుంది.
-టాప్ 2 జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. విజేత ఫైనల్ కు చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్ 2లో ఆడుతుంది.
-కొత్త విధానంలో మూడు ఎలిమినేటర్లు, రెండు క్వాలిఫయర్లు జరుగుతాయి. ఈ పద్ధతితో సీజన్ ను ఆసాంతం జన రంజకంగా నిర్వహించవచ్చని ఆర్గనైజర్లు భావిస్తున్నారు.
