హోటల్లో లంక మహిళపై పాక్ క్రికెటర్ పాడు బుద్ధి.. ఎవరతడు?
ఏదైనా దేశానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి..! అదే ఎవరైనా క్రీడాకారుడిగా విదేశానికి వెళ్తే మరింత ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి.
By: Tupaki Political Desk | 5 March 2026 9:00 PM ISTఏదైనా దేశానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి..! అదే ఎవరైనా క్రీడాకారుడిగా విదేశానికి వెళ్తే మరింత ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. కానీ, పాకిస్థాన్ క్రికెటర్లకు ఇవేమీ లేనట్లుంది. అసలే అత్యంత అధ్వాన క్రికెట్ బోర్డు.. దీనికితోడు దారుణమైన సెలక్షన్..! ఇంకేం పాకిస్థాన్ అంటేనే డిసిప్లిన్ లేని జట్టుగా పేరుపడింది. దీనికి అద్దంపట్టేలా తాజాగా టి20 ప్రపంచ కప్ లో ఓ ఘటన చోటుచేసుకుంది. గత ఏడాది జరిగిన పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆటగాళ్లకు భారత వీసాలు ఇవ్వడం లేదు. దీంతో టి20 ప్రపంచకప్ మ్యాచ్ లను ఆ దేశం శ్రీలంకలో ఆడింది. ఒకవేళ పాక్ సెమీఫైనల్, ఫైనల్ చేరినా ఇదేవిధంగా మ్యాచ్ లను లంకలోనే ఆడాల్సి ఉండేది. అయితే, సూపర్ 8 దశలోనే పాక్ జట్టు వెనుదిరగడంతో ఆ అవసరం లేకపోయింది. కానీ, పాక్ ప్లేయర్ చేసిన పని మాత్రం ఆ దేశం పరువు తీసేలా చేసింది.
సూపర్ 8 కు ముందు పరువు తక్కువ పని
పాక్ చచ్చీ చెడి సూపర్ 8కు వచ్చింది. ఇక్కడ బోల్తాపడి సెమీఫైనల్స్ కు దూరమైంది. ఒకవేళ చివరి మ్యాచ్ లో గనుక శ్రీలంకను తక్కువ పరుగులకే ఆపేసి ఉంటే మెరుగైన రన్ రేట్ తో సెమీస్ కు వెళ్లేది. లంక మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. ఇక అసలు విషయానికి వస్తే శ్రీలంకలో బస చేసిన హోటల్ లో మహిళా ఉద్యోగి పట్ల పాక్ ప్లేయర్ అనుచితంగా ప్రవర్తించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ఘటన క్యాండీలో జరిగింది. పైగా, అది కూడా శ్రీలంకతో సూపర్ 8 మ్యాచ్ కు ముందు కావడం గమనార్హం.
హౌస్ కీపింగ్ ఉద్యోగిపైనా...
పాక్ ప్లేయర్ కన్నేసింది హౌస్ కీపింగ్ ఉద్యోగిని మీద అని సమాచారం. అతడి తీరుతో బెంబేలెత్తిన ఆ మహిళ గట్టిగా కేకలు వేసినట్లు తెలిసింది. ఇతర సిబ్బంది వచ్చి ఆమెను కాపాడినట్లు చెబుతున్నారు. అనంతరం హోటల్ సిబ్బంది అందరూ కలిసి.. పాక్ ప్లేయర్ పై వారి జట్టు మేనేజర్ నవీద్ చీమాకు ఫిర్యాదు చేశారట. అటు హోటల్ మేనేజ్ మెంట్ కూడా సీరియస్ గా స్పందించడంతో నవీద్ చీమా ఆటగాళ్ల తరఫున క్షమాపణ కోరినట్లు తెలిసింది.
ఎవరా క్రికెటర్?
పాక్ ఆటగాళ్లలో మహిళతో అనుచితంగా ప్రవర్తించింది ఎవరు? అనేది తెలియరాలేదు. అతడిపై ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) క్రమిశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అనంతరం మరిన్ని చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
