ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ సాగుతుందా? లేదా?
పాకిస్థాన్ లోని ఉగ్రవాద అడ్డాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది..
By: Tupaki Desk | 7 May 2025 3:01 PM ISTపాకిస్థాన్ లోని ఉగ్రవాద అడ్డాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది.. దీని ప్రభావం ఎన్ని విధాలుగా ఉంటుందోననే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు క్రీడా ప్రపంచం నుంచి స్పందనను కూడా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే.. ఏడు దేశాల క్రీడాకారులు ప్రస్తుతం భారత్ లో ఉన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పాకిస్థాన్ పై భారత్ ప్రతీకార దాడులతో.. తమ ఆటగాళ్ల భద్రతపై ఆయా విదేశీ ప్రభుత్వాలు ఆరా తీయడం సహజం. మరి ఈ నేపథ్యంలో ఐపీఎల్ సాగుతుందా? ఇంతటితో ఆపేస్తారా? అనేది చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ లో 56 మ్యాచ్ లు ముగిశాయి. మరో 14 లీగ్ మ్యాచ్ లు, నాలుగు ప్లేఆఫ్స్ ఉన్నాయి. ప్లేఆఫ్స్ సమీపిస్తున్న ఈ సమయంలో ఐపీఎల్ ను ఆపివేయడం కొంచెం ఇబ్బందికరమే. అయితే, భారత్-పాక్ ఉద్రిక్తతల రీత్యా ఏం చేస్తారు? అనే ప్రశ్న తలెత్తింది.
ఊహాగానాల నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. ఐపీఎల్ నిర్వహణ యథావిధిగా సాగుతుందని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఉండదని పేర్కొంది. కాగా, పాకిస్థాన్ సరిహద్దులోని పంజాబ్ లో జరుగుతున్న మ్యాచ్ లను వేరేచోటకు మార్చే అవకాశం ఉందని సమాచారం. ఈ మ్యాచ్ లను ఢిల్లీకి తరలిస్తారని అంటున్నారు.
ఐపీఎల్ లో పంజాబ్ రాష్ట్రం పేరిట పంజాబ్ కింగ్స్ అని జట్టు ఉంది. ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ప్రదర్శన చేస్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ దశకు దగ్గరగా ఉంది.