Begin typing your search above and press return to search.

చరిత్రలో తొలిసారి.. ఐపీఎల్ నిరవధిక వాయిదా

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్ నిరవధిక వాయిదాకు దారితీశాయి.

By:  Tupaki Desk   |   9 May 2025 1:20 PM IST
IPL 2025 Suspended
X

2008లో మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ద్వితీయ విఘ్నం ఎదురైంది. అంటే.. 2009లో భారత్ లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లీగ్ ను దక్షిణాఫ్రికాకు మార్చారు. ఇక దీనికిముందే 2008 నవంబరు 26న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత ఆర్థిక రాజధాని ముంబైపై భయంకర దాడులు చేశారు. దీంతో ఆనాటి నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐపీఎల్ లో చాన్స్ లేకుండా పోయింది.

13వ సీజన్ వచ్చేప్పటికీ 2020లో ఐపీఎల్ కు కొవిడ్ సమస్య ఎదురైంది. మహమ్మారి కారణంగా లీగ్ ను అప్పుడు వాయిదా వేసి సెప్టెంబరులో దుబాయ్ లో నిర్వహించారు.

అయితే, దక్షిణాఫ్రికాలో జరిగినా, దుబాయ్ లో జరిగినా 17 సీజన్లలో ఎన్నడూ ఐపీఎల్ మాత్రం ఆగలేదు. కానీ, చరిత్రలో తొలిసారి భారత్ లో జరుగుతుండగా లీగ్ వాయిదా పడింది.

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్ నిరవధిక వాయిదాకు దారితీశాయి. అత్యంత ఆసక్తికరంగా సాగుతూ వస్తున్న 18వ సీజన్లో కొత్త చాంపియన్ ను చూస్తామా? అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాంటిది యుద్ధ ప్రభావంతో లీగ్ ఆగిపోయింది.

ఫైనల్, ప్లేఆఫ్స్ కలిపి ఐపీఎల్ లో 74 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. గురువారం ధర్మశాలలో రద్దయిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సహా 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా 16 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే, యుద్ధం తీవ్రం అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో లీగ్ ను నిరవధికంగా వాయిదా వేయడమే ఉత్తమం అని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.