ఐపీఎల్ రీ స్టార్ట్.. ఇదిగో ఈ తేదీ నుంచే..
ఏకధాటిగా 57 మ్యాచ్ ల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ పై భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల ప్రభావం పడింది.
By: Tupaki Desk | 11 May 2025 9:48 AMఏకధాటిగా 57 మ్యాచ్ ల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ పై భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల ప్రభావం పడింది. యుద్ద వాతావరణంలో లీగ్ నిర్వహణ సరికాదని భావించి వాయిదా వేశారు. దీంతో అభిమానులంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా శనివారం భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితులు చల్లబడ్డాయి. ఆ వెంటనే ఐపీఎల్ నిర్వహణకు అడ్డంకులు తొలగినట్లు స్పష్టమైంది.
గత గురువారం పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న 58వ మ్యాచ్ ను అర్థంతరంగా నిలిపివేశారు. ప్రేక్షకులను పంపించేసి.. మ్యాచ్ ను ఆపివేశారు. సహజంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. ఇక్కడ అది కూడా చేయలేదు. శుక్రవారం లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ నుంచి లీగ్ ఆగిపోయింది. శనివారం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్-కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. శుక్రవారమే లీగ్ ను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు కథనాలు వచ్చాయి.
భారత్-పాక్ ఉద్రిక్తతలు చల్లారడంతో తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఐపీఎల్ పున:ప్రారంభం ఎప్పుడో తేలిపోయింది. ఈ నెల 15 నుంచి లీగ్ మళ్లీ మొదలు కానుంది.
అసలు షెడ్యూల్ ప్రకారం మే 15న ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన ముంబైలో మ్యాచ్ జరగాల్సి ఉంది. మరి ఈ మ్యాచ్ నుంచి నిర్వహణ మొదలుపడతారా? లేక మే 8న ఆగిపోయిన ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ నుంచి మొదలుపెడతారా? అనేది చూడాలి.
లీగ్ లో 12 లీగ్ మ్యాచ్ లు, మూడు ప్లేఆఫ్స్, ఫైనల్ మిగిలి ఉంది. ఐపీఎల్ వాయిదాతో కొందరు విదేశీ ఆటగాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు. వారందరినీ వెనక్కు పిలిచే చాన్సుంది. ఇక అహ్మదాబాద్ లో మూడు, లక్నో, బెంగళూరులో 2, చెన్నై, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, ధర్మశాలలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల రీత్యా ధర్మశాలలో మ్యాచ్ ను నిర్వహించడం కష్టమే. మిగతా వేదికల్లో నిర్వహణకు అభ్యంతరాలు లేవు.
8వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు మ్యాచ్ లు ఆగిపోయాయి. వీటిని నిర్వహిస్తే లీగ్ మరికొన్ని రోజులు పొడిగించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఫైనల్ జరగాల్సి ఉంది. ఇప్పుడు అది జూన్ 1కి మారుతుందేమో? అంతా బీసీసీఐ నుంచి అప్ డేట్ పై ఆధారపడి ఉంది.