Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కు బ్రేక్.. విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటో..?

ఎటొచ్చీ విదేశీ ఆటగాళ్లే హోటల్ రూమ్ లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఏం చేయాలి? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

By:  Tupaki Desk   |   10 May 2025 6:00 PM IST
ఐపీఎల్ కు బ్రేక్.. విదేశీ ఆటగాళ్ల పరిస్థితి ఏమిటో..?
X

అంతా బాగుంటే.. ఈ రోజుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్లేఆఫ్స్ జట్లు ఏవో దాదాపు ఓ అంచనా వచ్చేది.. ఇంకా చెప్పాలంటే టేబుల్ టాపర్ ఎవరో కూడా తేలిపోయేది. కానీ, ఏం చేస్తాం..? పాకిస్థాన్ ఉగ్ర పీక నొక్కేందుకు భారత్ చేస్తున్న ధర్మ యుద్ధానికి బాసటగా ఐపీఎల్ ను వారం రోజుల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది.

ఆటకు విరామం.. ఆటగాళ్లకు సంకటం.. ఇదీ ప్రస్తుతం ఐపీఎల్ లో పాల్గొనేందుకు భారత్ కు వచ్చిన విదేశీ ఆటగాళ్ల పరిస్థితి. పంజాబ్ కింగ్స్–ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలో గురువారం జరుగుతున్న మ్యాచ్ ను మధ్యలో నిలిపివేశారు. శుక్రవారం నుంచి విరామం ప్రకటించారు. తొలుత సీజన్ రద్దు అనే వార్తలు వచ్చినా చివరకు వారం పాటు వాయిదాతో సరిపెట్టారు.

ఇండియన్ క్రికెటర్లకు ఐపీఎల్ వాయిదాతో వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే వారివారి సొంత నగరాలకు వెళ్లిపోతారు. ఎటొచ్చీ విదేశీ ఆటగాళ్లే హోటల్ రూమ్ లకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లు ఏం చేయాలి? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

వారం రోజులు అంటే పెద్ద వ్యవధే. అయితే, ఆపైన కూడా ఐపీఎల్ జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. ఇలా విదేశీ ఆటగాళ్లు ఎన్నాళ్లని హోటల్ రూమ్ లలో కూర్చుని ఉంటారు...? కాగా, వీరిలో ఇప్పటికే కొందరు తమ దేశాలకు వెళ్లిపోయే ప్రణాళికల్లో ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. చాలామంది క్రికెటర్లు కుటుంబాలను వదిలేసి వచ్చి ఉంటారు. మరికొందరు కుటుంబాలతో వచ్చినా మ్యాచ్ లు లేని నేపథ్యంలో ఏం చేయగలరు? బయటకు వెళ్దామన్నా వారి క్రికెట్ బోర్డులు ఒప్పుకొంటాయా? అనేది అనుమానమే కదా?

బీసీసీఐ మాత్రం వారం తర్వాత ఐపీఎల్ మళ్లీ జరుగుతుందని గట్టిగా చెబుతోంది. భారత అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా కోరుకునేది ఇదే.