Begin typing your search above and press return to search.

"టాప్" లేపిన టీం ఇండియా... కారణం చెబుతున్న కివీస్!

ఓటమికి కారణం చెబుతున్న కివీస్ కెప్టెన్

By:  Tupaki Desk   |   23 Oct 2023 4:32 AM GMT
టాప్ లేపిన టీం ఇండియా... కారణం చెబుతున్న కివీస్!
X

ఆస్ట్రేలియాతో మ్యాచ్ అన్నప్పుడూ పెద్ద టెన్షన్ లేదు.. పాకిస్థాన్ తో అన్నప్పుడు 8-0 పై అనుమానం లేదు.. కానీ, న్యూజిలాండ్ తో మ్యాచ్ అనేసరికి ఎక్కడో తెలియని చిన్న సందేహం.. చిన్న భయం. భారత్ వరుస గెలుపులను కివీస్ అడ్డుకుంటుందా.. వీరవిహారం చేస్తున్న భారత్ కు బందం వేస్తుందా అనే భయం కలిగింది. కానీ.. చిన్న చిన్న తప్పిదాలు, కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ... భారత్ "టాప్" లేపింది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.

వన్డే ప్రపంచకప్‌ లో మ్యాచ్‌ మ్యాచ్‌ కూ మెరుగవుతున్న రోహిత్‌ సేన.. అజేయ రికార్డును కొనసాగిస్తూ వరుసగా అయిదో మ్యాచ్‌ లోనూ విజయం సాధించింది. ఫీల్డింగ్ లో కొన్ని విలువైన తప్పిదాలు చేసినప్పటికీ... విజయాన్ని మాత్రం వదలలేదు. న్యూజిలాండ్‌ ను 4 వికెట్ల తేడాతో ఓడించి టోర్నీలో ఆ జట్టుకు తొలి ఓటమి రుచి చూపింది. ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ గెలిచిన ఏకైక టీం గా నిలిచింది. ఇలా కివీస్ పై గెలవడానికి భారత్ కు 20 ఏళ్లు పట్టింది!

అవును... గత 20 ఏళ్లుగా వన్డే ప్రపంచకప్‌ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు చెక్ పెట్టడంతో పాటు.. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీం ఇండియా. 2003 వన్డే ప్రపంచకప్‌ లో చివరిసారిగా న్యూజిలాండ్‌ పై గెలిచిన టీమిండియా.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ విజయాన్నందుకుంది.

ఓటమికి కారణం చెబుతున్న కివీస్ కెప్టెన్:

వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడం, ఈ టోర్నీలో వారికిదే తొలి పరాజయం కావడంపై ఆ జట్టు కెప్టెన్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన టాం లాథం... ఇంకొన్ని పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌ లో చివరి 10 ఓవర్లను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు తెలిపాడు.

ఇదే సమయంలో ఈ మ్యాచ్‌ లో బాగా ఆడినప్పటికీ.. టీమిండియా తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని చెప్పిన టాం లూథం... తదుపరి మ్యాచ్‌ కు మాకు చాలా సమయం ఉందని, బలంగా పుంజుకోవడంపై ఫోకస్ పెడుతామని అన్నారు. ఇదే సమయంలో... రచిన్, డారిల్ అసాధారణ బ్యాటింగ్ చేశారని అభినందించాడు.

షమీ రిపీట్ కావాలి – ఫీల్డింగ్ రిపీట్ కావొద్దు:

ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇన్ని రోజులూ షమీని ఎందుకు ఆడించలేదనే పెద్ద ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. అతని ప్లేస్ లో బ్యాటింగ్ కూడా చేస్తాడనే ఒకే ఒక్క కారణంతో శార్ధూల్ ఠాకూర్ ను తీసుకోవడంపై నిన్నమొన్నటివరకూ తెగ కామెంట్లు వినిపించేవి. ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ... తనకు తానే సాటి, తనతో లేరెవరూ పోటీ అని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు షమీ. ఈ వరల్డ్ కప్ లో ఆడిన ఈ తొలిమ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీసుకున్నాడు.

వాస్తవానికి ఈ టోర్నమెంట్ లో మొదటి నాలుగు మ్యాచ్ లలోనూ టీం ఇండియా ఫీల్డింగ్ పై ప్రశంసలు వచ్చాయి. ఫీల్డింగ్ యూనిట్ కూడా పక్కాగా ఉందనే కామెంట్లు వినిపించాయి. ఒత్తిడి ఫలితమో.. లేక, మైదానలో తేమ వల్ల స్కిడ్ అవుతుందనే పరిస్థితుల ఫలితమో తెలియదు కానీ... ఈ మ్యాచ్ లో టీం ఇండియా కాస్త చెత్త ఫీల్డింగ్ చేసిందనే చెప్పుకోవాలి!

11వ ఓవర్లో రచిన్‌ రవీంద్ర ఇచ్చిన తేలికైన క్యాచ్‌ ను జడేజా నేలపాలు చేశాడు. అప్పటికి రచిన్‌ స్కోరు 12 మాత్రమే. కట్ చేస్తే... 34వ ఓవర్లో 75 పరుగుల వద్ద కానీఅతడు ఔట్‌ కాలేదు. 30వ ఓవర్లో జడేజా బౌలింగ్‌ లో మిచెల్‌ ఇచ్చిన క్యాచ్‌ ను రాహుల్‌ అందుకోలేకపోయాడు. మూడు ఓవర్ల తర్వాత కుల్‌ దీప్‌ బౌలింగ్‌ లో మిచెల్‌ ఇచ్చిన క్యాచ్‌ ను బౌండరీ వద్ద బుమ్రా నేలపాలు చేశాడు.

దీంతో నెక్స్ట్ మ్యాచ్ లో షమీ రిపీట్ అవ్వడం ఎంత ముఖ్యమో... ఇలాంటి ఫీల్డింగ్ రిపీట్ కాకపోవడం కూడా అంతే ముఖ్యం అని కామెంట్లు పెడుతున్నారు అభిమానులు!

ఇక న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ లో మిచెల్‌ - 130, రచిన్‌ - 75లు మాత్రమే రాణించారు. దీంతో... 50 ఓవర్లలో 273 పరుగులకు కివీస్ ఆలౌట్‌ అయ్యింది. భారత్‌ ఇన్నింగ్స్‌ లో రోహిత్‌ - 46, కోహ్లి - 95, శ్రేయస్‌ - 33, రాహుల్‌ - 27, జడేజా నాటౌట్‌ - 39 లు తలోచేయి వేయడంతో 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసింది. దీంతో... మరోసారి ఛేజింగ్ స్టార్ గా కొహ్లీ రికార్డులకెక్కాడు!

ఇక బౌలింగ్ విభాగంలో షమి 5 వికెట్లు తీసుకోగా... కుల్ దీప్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇదే క్రమంలో బూమ్రా, సిరాజ్ లు చెరొక వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో ఫెర్గూసన్‌ 2 వికెట్లు తీసుకోగా... బౌల్డ్, హెన్రీ, శాంటర్న్ లు తలోవికెట్ తీసుకున్నారు.

కోహ్లీ జస్ట్ మిస్... తెరపైకి "సెల్ఫిష్" ట్రెండింగ్!:

న్యూజిలాండ్ మ్యాచ్ లో కొహ్లీ తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 95 పరుగుల వద్ద సిక్స్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే... కొంతమంది నెటిజన్లు మాత్రం "సెల్ఫిష్" హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. గత రెండు మ్యాచ్ లుగా సెంచరీల కోసం బాల్స్ వేస్ట్ చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కొహ్లీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చివరివరకూ నిలబడి గెలిపిస్తున్నది తప్ప అన్నీ కనిపిస్తున్నాయంటూ మండిపడుతున్నారు.

వాస్తవానికి న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కూడా కొహ్లీ సెంచరీ చేసి ఉంటే... వన్ డేల్లో అతధిక సెంచరీలు చేసిన సచిన్ (49) రికార్డును సమం చేసేవాడు. ప్రస్తుతం కొహ్లీ 48 సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లోనే సచిన్ ను రికార్డును సమం చేయడంతోపాటు.. సెంచరీలలో హాఫ్ సెంచరీని కూడా పూర్తిచేయాలని కోరుకుంటున్నారు అభిమానులు!