Begin typing your search above and press return to search.

భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరగదా? కష్టమేనా?

ప్రపంచ ప్రసిద్ధ వాతావరణ సంస్థ అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు సాయంత్రం 5 గంటల సమయంలో జల్లులు పడే అవకాశం ఉంది.

By:  A.N.Kumar   |   14 Feb 2026 2:56 PM IST
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరగదా? కష్టమేనా?
X

టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. అయితే ఈ బిగ్ మ్యాచ్‌పై ఇప్పుడు వర్షం భయం కమ్ముకుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ సజావుగా జరుగుతుందా లేదా అన్నది వాతావరణంపై ఆధారపడి ఉంది.

అల్పపీడనం హెచ్చరికతో ఆందోళన

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ వ్యవస్థ ప్రభావంతో కొలంబోలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలగొచ్చనే భయం నెలకొంది.

అక్యూవెదర్ అంచనాలు ఏమంటున్నాయి?

ప్రపంచ ప్రసిద్ధ వాతావరణ సంస్థ అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు సాయంత్రం 5 గంటల సమయంలో జల్లులు పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారీ వర్షం పడే సూచనలు తక్కువగా ఉన్నాయని అంచనా. ఆట సమయంలో మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉండగా ఉష్ణోగ్రత సుమారు 27 డిగ్రీల సెల్సియస్‌గా ఆర్ద్రత 70 శాతం వరకు ఉండొచ్చని పేర్కొంది.

ఓటమి ఎరుగని జట్లు.. కీలక పోరు

ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్ జట్లు రెండూ ఓటమి చూడలేదు. సూపర్-8 దశకు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో విజయం ఎంతో కీలకం. భారత్ జట్టు అమెరికాపై కష్టపడి గెలిచి, తరువాత నమీబియాపై భారీ విజయాన్ని నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు నెదర్లాండ్స్‌పై తడబడినా అమెరికాపై ఘన విజయం సాధించి దూసుకెళ్తోంది.

భారత్ ఆధిక్యం స్పష్టంగా

టీ20 ప్రపంచకప్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 8 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 7 మ్యాచ్‌లలో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది, అది 2021లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లోనే సాధ్యమైంది.

మ్యాచ్ రద్దయితే?

వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే ఇరు జట్లు కూడా విజయం సాధించి తమ సూపర్-8 అవకాశాలను బలపరచుకోవాలని చూస్తున్నాయి.

ఆసక్తికర సమరం ముందుంది

భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా పాకిస్థాన్ చరిత్రను మార్చాలని సంకల్పంతో సిద్ధమవుతోంది. వర్షం అంతరాయం కలిగించకపోతే అభిమానులకు మరో థ్రిల్లింగ్ పోరు ఖాయం. ఇప్పుడేమో ఒక్క ప్రశ్నే మిగిలింది.. వర్షం ఆడనిస్తుందా? లేక మ్యాచ్‌ను నిలిపేస్తుందా? అని చూడాలి..