టీమిండియాకు ఏంటి దుస్థితి? వరస్ట్ డేలో వరుస చెత్త రికార్డులు.. ఫ్యాన్స్లో తీవ్ర నిరాశ
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ 100కు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతేకాదు వరుసగా ఐదు టీ20 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోవడం కూడా ఇదే మొదటిసారి.
By: A.N.Kumar | 8 July 2026 11:45 AM ISTఇంగ్లాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా ప్రదర్శన తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా బ్యాటింగ్లో కనీస పోరాట పటిమ కూడా చూపించకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క మ్యాచ్తో భారత జట్టు పేరిట ఎన్నో అవాంఛనీయ రికార్డులు నమోదవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ 100కు పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతేకాదు వరుసగా ఐదు టీ20 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోవడం కూడా ఇదే మొదటిసారి. మరోవైపు పవర్ప్లే ముగిసేలోపే ఐదు వికెట్లు కోల్పోవడం జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పట్టింది. చివరకు కేవలం 76 పరుగులకే ఆలౌట్ కావడం భారత టీ20 చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుగా నమోదైంది.
ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ అద్భుతమైన బౌలింగ్తో భారత టాప్ ఆర్డర్ను కుప్పకూల్చేశారు. అయితే బౌలర్ల ప్రతిభతో పాటు భారత బ్యాటర్ల ఆతురత కూడా జట్టు పతనానికి ప్రధాన కారణమైంది. క్రీజులో కుదురుకుని ఇన్నింగ్స్ను నిర్మించాల్సిన సమయంలో ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే ప్రయత్నం చేశారు. ఫలితంగా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిని మరింత పెంచుకున్నారు.
టి20 ఫార్మాట్ అంటే కేవలం భారీ షాట్లు మాత్రమే కాదు.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. సింగిల్స్ తీసుకుంటూ భాగస్వామ్యాలు నిర్మించడం కూడా అంతే కీలకం. కానీ భారత బ్యాటర్లు ఆ ప్రాథమిక అంశాన్ని పూర్తిగా విస్మరించారు. కనీసం నిర్ణీత 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోవడం జట్టు ప్రణాళికలో లోపాలను స్పష్టంగా బయటపెట్టింది.
జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్, వరుస ప్రయోగాలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా ప్రయోగాలకే ప్రాధాన్యం ఇస్తూ జట్టు సమతుల్యతను దెబ్బతీస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఓపెనర్గా అవకాశం పొందిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ ద్వారా స్పష్టంగా తెలిసొచ్చింది. యువ ఆటగాళ్లకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. వారికి సరైన మద్దతు, స్థిరమైన ప్రణాళిక కూడా అంతే అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిరీస్ ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో భారత జట్టు ఈ పరాజయం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం.. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు నిర్మించడం.. అనవసర షాట్లకు దూరంగా ఉండడం వంటి అంశాలపై దృష్టి పెడితేనే టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ సిరీస్ భారత జట్టుకు మరింత చేదు జ్ఞాపకంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
