Begin typing your search above and press return to search.

మళ్లీ అదే కథ.. కెప్టెన్ గిల్, ఇషాన్ ఆడకుంటే టీమిండియా పరిస్థితేంటి?

అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు 402 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ జట్టులో పాత రోగం మళ్లీ బయటపడింది.

By:  A.N.Kumar   |   17 Jun 2026 8:06 PM IST
మళ్లీ అదే కథ.. కెప్టెన్ గిల్, ఇషాన్ ఆడకుంటే టీమిండియా పరిస్థితేంటి?
X

అఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు 402 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ జట్టులో పాత రోగం మళ్లీ బయటపడింది. ఓపెనర్లు, టాప్ ఆర్డర్ రాణిస్తే ఓకే.. కానీ వారు విఫలమైతే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నను ఈ మ్యాచ్ మరోసారి లేవనెత్తింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకానొక దశలో స్కోరు 450 దాటుతుందనిపించినా మిడిల్ ఆర్డర్ ఘోర వైఫల్యం వల్ల టీమిండియా ఆ మైలురాయిని అందుకోలేకపోయింది.

గిల్, ఇషాన్ రికార్డు భాగస్వామ్యం

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో రోహిత్ శర్మ (48) వేగంగా ఆడి మంచి పునాది వేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ అఫ్ఘాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 140 బంతుల్లోనే 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ 154 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా ఇషాన్ కిషన్ 125 పరుగులతో దూకుడైన సెంచరీ సాధించాడు. మైదానం నలుమూలలా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.

కుప్పకూలిన మిడిల్ ఆర్డర్

భారత్ స్కోరు 360 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. గిల్, ఇషాన్ పెవిలియన్ చేరిన వెంటనే భారత ఇన్నింగ్స్ చేతులెత్తేసింది. కేవలం 42 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 6 వికెట్లను కోల్పోయింది. జైస్వాల్ 4, శ్రేయస్ అయ్యర్ 26, కేఎల్ రాహుల్ 0, వాషింగ్టన్ సుందర్ 19 ఇలా చివర్లో వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు బ్రార్ (3), అర్ష్‌దీప్ (3), ప్రిన్స్ యాదవ్ (5) కూడా పూర్తిగా నిరాశపరిచారు. అఫ్ఘాన్ బౌలర్లలో ఖరోటి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3 వికెట్లతో భారత బ్యాటింగ్ వెన్ను విరిచారు.

2027 వరల్డ్ కప్ ముందు ఆందోళనకరం

ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తోంది. యువ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఇదొక మంచి అవకాశం. కానీ కీలక సమయంలో అనుభవజ్ఞులైన బ్యాటర్లు కూడా బాధ్యతారాహిత్యంగా వికెట్లు పారేసుకోవడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ గిల్, ఇషాన్ త్వరగా అవుట్ అయి ఉంటే టీమిండియా పరిస్థితి ఏంటనే ప్రశ్న అభిమానుల్లో వ్యక్తమవుతోంది. 402 పరుగులు చేయడం ఆనందాన్ని కలిగించే విషయమే అయినా కేవలం ఒకరిద్దరి పైనే ఆధారపడే సంస్కృతి మారకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 2027 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియా ఈ మిడిల్ ఆర్డర్ బలహీనతను ఎంత త్వరగా అధిగమిస్తే అంత మంచిది.