అతడికే టీమ్ ఇండియా టెస్టు దండం.. డిప్యూటీగా రిషభ్ పంత్
జూన్ లో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా బయల్దేరాల్సి ఉంది.
By: Tupaki Desk | 11 May 2025 2:30 PMస్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ అనూహ్య రిటైర్మెంట్ తో టీమ్ ఇండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నలు వచ్చాయి.. ఇప్పటికే కొన్ని టెస్టుల్లో కెప్టెన్సీ చేసిన మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాకా? విదేశాల్లో కొన్ని మంచి ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించిన వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కా? సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కా? యువ సంచలనం ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కా? ఎవరికి? ఇలా నలుగురు పోటీలో ఉన్నప్పటికీ సెలక్షన్ కమిటీ మాత్రం వీరెవరూ కాక మరొకడిని సెలక్ట్ చేసింది.
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ అంటే ఆ రేంజ్ వేరు.. ఆటలో నిలకడ ఉండాలి.. బ్యాటర్ అయితే టెక్నిక్ ఉండాలి.. బౌలర్ అయితే మెరికలా ఉండాలి.. మరి టీమ్ ఇండియాలో ప్రస్తుతం ఆ స్థాయి ఉన్నది ఇద్దరికే. ఒకరు జస్ప్రీత్ బుమ్రా కాగా.. రెండోవాడు శుబ్ మన్ గిల్. అందుకే వీరిలో ఒకరిని టెస్టు కెప్టెన్ చేస్తున్నది సెలక్షన్ కమిటీ.
బుమ్రా అద్భుతమైన బౌలరే. కానీ, గాయాల బెడద ఉంది. ఇటీవలే గాయం నుంచి కోలుకుని వచ్చాడు. పైగా బుమ్రా వంటి పేస్ బౌలర్ ఎప్పుడో కానీ దొరకడు. అందుకని అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నేపథ్యంలోనే శుబ్ మన్ గిల్ కు టెస్టు కెప్టెన్సీ ఇవ్వడం ఖాయమైంది.
ముహూర్తం ఎప్పుడంటే?
జూన్ లో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. దీనికోసం ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా బయల్దేరాల్సి ఉంది. అందుకని ఈ నెల 23, 24 తేదీల్లో కెప్టెన్ గా గిల్ ను ప్రకటించడం లాంచనమే అంటున్నారు. గిల్.. ఇప్పటికే టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీని కూడా సంప్రదించినట్లు సమాచారం. మరోవైపు గిల్ కు డిప్యూటీగా రిషభ్ పంత్ ను ప్రకటిస్తారని అంటున్నారు. వాస్తవానికి గత ఆస్ట్రేలియా టూర్ లో బుమ్రా వైస్ కెప్టెన్-కెప్టెన్ గా చేశాడు. ఇప్పుడు అతడికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ బౌలింగ్ పైనే ఫోకస్ పెట్టేలా చూస్తున్నారు.