ఇండియా ఆతిథ్య టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్.. బీసీసీఐపై ఆగ్రహం
భారతదేశం అటు రాజకీయంగా, ఇటు క్రీడల పరంగా కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిర్దిష్టంగా నిలబడుతూ వస్తోంది.
By: Tupaki Desk | 3 Jun 2025 11:06 PM ISTభారతదేశం అటు రాజకీయంగా, ఇటు క్రీడల పరంగా కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిర్దిష్టంగా నిలబడుతూ వస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్పై మన దేశం ఎప్పుడూ నిష్పక్షపాత ధోరణి చూపలేదు. ఇప్పటివరకు బీసీసీఐ కూడా అదే మార్గంలో నడిచింది. పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించడం లేదు. మన జట్లు వారి దేశానికి ప్రయాణించకూడదు అన్న కఠిన నిర్ణయంతో ఉంటున్నాయి.
అయితే ఈ కఠిన నిబంధనలు 2026 టీ20 వరల్డ్కప్ పై ప్రభావం చూపిస్తోంది. భారతదేశం 2026 టీ20 వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తోంది. అహ్మదాబాద్, కోల్కతా, ధర్మశాల, పుణె, ముంబయి వంటి ప్రసిద్ధ స్టేడియంలు ప్రపంచ క్రికెట్ను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా, పాక్కు మాత్రం మన భూభాగంలో స్థానం లేదు. ఇది నిస్సందేహంగా భారతీయుల దేశభక్తిని, భద్రతాపరమైన ఆందోళనలను ప్రతిబింబిస్తుంది.
అయితే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు శ్రీలంకలోని కొలంబోలో జరగబోతున్నాయని సమాచారం. ఈ వార్త వెలుగులోకి వచ్చాక దేశభక్తులు, క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ, బీసీసీఐలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీసీఐ కార్యదర్శి జయ్ షాపై విమర్శలు గుప్పిస్తూ.. మునుపటి బీసీసీఐ అధ్యక్షులు శ్రీనివాసన్, మనోహర్ కాలాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో పాక్కు ఒక్క అడుగు అవకాశం ఇవ్వలేదని ప్రశంసిస్తున్నారు.
ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐ ఇద్దరూ ఒత్తిడిలో ఉన్నప్పుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి కొత్త ఇబ్బందులు ఏర్పడతాయా? పాకిస్తాన్కు మరోసారి అంతర్జాతీయ క్రికెట్లో అంతులేని ప్రాధాన్యం లభిస్తుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఈ పరిస్థితులు మారాలంటే బీసీసీఐ ఆత్మపరిశీలన చేసుకోవాలి. జాతీయ గౌరవం ముందుందా? లేక వాణిజ్య ప్రయోజనాలే ముఖ్యమా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈ నిర్ణయాలు కేవలం క్రీడాపరమైనవే కాకుండా, దేశభక్తిని, భద్రతాపరమైన అంశాలను కూడా ప్రభావితం చేస్తాయి.
