పాక్ తో మ్యాచ్ కు ముందు టీమ్ ఇండియాకు పెద్ద టెన్షన్లు
టీమ్ఇండియా మరో టెన్షన్ లోయరార్డర్ ఫినిషర్ రింకూ సింగ్. 8వ నంబరులో అక్షర్ పటేల్ వస్తుండగా.. 7లో రింకూ దిగుతున్నాడు.
By: Tupaki Political Desk | 13 Feb 2026 6:00 PM ISTసహజంగా అయితే ఈపాటికి టీమ్ఇండియా మాంచి హుషారుగా ఉండాలి. వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిచి టి20 ప్రపంచ కప్ లో దుమ్మురేపుతున్నందున తిరుగులేని ఉత్సాహంతో కనిపించాలి. ఆదివారం పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో ఎంత తేడాతో గెలుస్తాం? అనే లెక్కలు వేసుకుంటూ ఉండాలి. కానీ, జట్టులో ఏదో తెలియని ఆందోళనే కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో తేడా కొడుతోంది. 8వ నంబరు వరకు హిట్టర్లున్నప్పటికీ.. వరుసగా వికెట్లు కోల్పోవడం, అది కూడా చిన్న జట్లపై కావడంతో కంగారు పుడుతోంది. వచ్చే మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొనే నేపథ్యంలో లోపాలను ఇప్పుడే సరిచేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
పాక్ ఆడుతోంది.. అతడు ఆడతాడా? లేదా?
ఆదివారం భారత్-పాక్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరగాల్సి ఉంది. లంక్ పిచ్ లు నెమ్మది. స్పిన్నర్లకు అనుకూలించే వికెట్ గా పేరున్న. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మెరుపు ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడతాడా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది. ప్రపంచ కప్ లో అమెరికాతో తొలి మ్యాచ్ లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. ఫీల్డింగ్ కు కూడా రాలేదు. దీంతో బ్యాకప్ ఓపెనర్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. నమీబియాపై మ్యాచ్ లో అభిషేక్ ఆడలేదు. అమెరికాతో మ్యాచ్ అనంతరం హైదరాబాదీ పేసర్ సిరాజ్ మాట్లాడుతూ అభిషేక్ గట్ (కడుపు నొప్పి) ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతున్నాడని, తర్వాతి మ్యాచ్ కు సిద్ధంగా ఉంటాడని చెప్పాడు. కానీ, నమీబియాతోనూ అభిషేక్ ఆడలేదు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం పాకిస్థాన్ తో మ్యాచ్ కూ అతడు డౌటే. దీంతో ఫామ్ లో లేని సంజూ శాంసన్ తోనే ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నా.. సంజూ అసలు టచ్ లో లేడు. అభిషేక్ గనుక కోలుకుని వస్తే.. టీమ్ఇండియాకు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఇంకోటి ఉండదు. అదే జరగాలని ఆశిద్దాం.
రింకూకు చాన్స్ ఉంటుందా?
టీమ్ఇండియా మరో టెన్షన్ లోయరార్డర్ ఫినిషర్ రింకూ సింగ్. 8వ నంబరులో అక్షర్ పటేల్ వస్తుండగా.. 7లో రింకూ దిగుతున్నాడు. ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే. వీరికిముందు ఆడే శివమ్ దూబె కూడా ఎడమచేతి వాటం బ్యాటరే. టాప్ ఆర్డర్ లోని ముగ్గురూ అభిషేక్ (ఆడితే), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండర్లే. ఇంతమంది మధ్య రింకూ వైఫల్యం కనిపించట్లేదు. కానీ, పాక్ తో మ్యాచ్ లో దీనినీ పరిగణించాల్సి ఉంటుంది. అప్పుడు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు అతడి స్థానం వదులుకోవాల్సి ఉంటుంది.
బౌలింగ్ బెంగలేదు..
మేటి పేసర్ బుమ్రా జ్వరంతో అమెరికాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. నమీబియాపై ప్రతాపం చూపాడు. మరో పేస
ర్ అర్షదీప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే, అర్ష పరుగులు భారీగా ఇస్తున్నాడు. పేస్ ఆల్ రౌండర్లు హార్దిక్, దూబె ఉన్నందున.. అర్ష స్థానంలో స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఆడించే అవకాశం లేకపోలేదు. మరి.. ఇదే దమ్ముతో ఆడి టీమ్ఇండియా.. పాక్ పై వరుసగా నాలుగో మ్యాచ్ (ఆసియా కప్ లో మూడు మ్యాచ్ లు సహా)లోనూ గెలవాలని కోరుకుందాం..!
