టికెట్ నో సేల్... భారత్-పాక్ మ్యాచ్ కు పెహల్గాం ఎటాక్ దెబ్బ!
ఇప్పుడు ఆసియా కప్ లో అదికూడా టి20 ఫార్మాట్ లో జరుగుతున్న నేపథ్యంలోనూ టికెట్ల కోసం అభిమానులు కనీసం ఆసక్తి చూపడం లేదంట.
By: Tupaki Desk | 13 Sept 2025 9:32 AM ISTప్రపంచంలో మరే రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినా అంత ఉద్రిక్తత, ఉత్కంఠ ఉండదు.. మరే రెండు దేశాల మధ్య పోటీ జరిగినా అంత ఒత్తిడి కనిపించదు... ఇంకే రెండు దేశాలు తలపడినా ప్రేక్షకులు ఈ స్థాయిలో ఆసక్తి చూపరు. భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే మాత్రం టికెట్లతో పాటు నరాలూ తెగుతాయి. కానీ, అది మొన్నటివరకు. ఇప్పుడు ఆసియా కప్ లో అదికూడా టి20 ఫార్మాట్ లో జరుగుతున్న నేపథ్యంలోనూ టికెట్ల కోసం అభిమానులు కనీసం ఆసక్తి చూపడం లేదంట.
హాట్ కేక్ నుంచి...
మొన్నటివరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే అది కరీబియన్ దీవుల్లో జరిగినా, ఆస్ట్రేలియాలో జరిగినా, ఇంగ్లండ్లో అయినా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. చాలా ముందే అభిమానులు వాటిని కొనేసేవారు. ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో ఆదివారం జరగనున్న మ్యాచ్ కు మాత్రం అసలు ఆసక్తి కనబరచడం లేదంట. దీనికి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ లో పెహల్గాంలో పర్యటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేయడమే.
నాలుగు నెలల్లోపే క్రికెట్టా?..
పెహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్ర దాడి జరిగింది. అంటే ఇప్పటికి నాలుగు నెలలు కూడా కాలేదు. అంతలోనే పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే టికెట్ల అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేట్లను తగ్గించినా కొనేవారు లేకపోవడం గమనార్హం.
-వాస్తవానికి ఆదివారం నాటి మ్యాచ్ టికెట్ ధర రూ.11,420 (దిర్హాంలలో అయితే 475). దీనిని రూ.8,415కు (350 దిర్హంలు) తగ్గించినా ఆసక్తి కనబరచడం లేదంట. నిర్వాహక ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఎంత ఖండిస్తున్నా.. టికెట్ల అమ్మకాలు ఊపులో లేవు. పది రోజుల కిందటే సేల్ పెట్టినా ఇంకా 50 శాతం టికెట్లూ కొనలేదు. మరి శనివారం, ఆదివారం మ్యాచ్ ప్రారంభ సమయానికి అయినా టికెట్లు సేల్ అవుతాయో లేదో...?
