ఇక ధోనీ పేరు దద్దరిల్లదు.. వారిద్దరిదే హవా
అయితే, గత సీజన్ లో ఫర్వాలేదని అనిపించిన ధోనీ.. ఈసారి మరీ దారుణంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
By: Tupaki Desk | 8 April 2025 12:15 PMరెండేళ్ల కిందటి వరకు టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో చెన్నై తరఫున మైదానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడంటే మైదానం దద్దరిల్లేది.. ఆ సమయంలో ప్రేక్షకులు మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులు చేసే శబ్దం ఎలా ఉండేదంటే.. చెవులు బద్దలయ్యేవి. క్రికెట్ ప్లస్ డెసిబుల్స్ లో చెప్పాలంటే అదొక శబ్ద విధ్వంసం.
అయితే, గత సీజన్ లో ఫర్వాలేదని అనిపించిన ధోనీ.. ఈసారి మరీ దారుణంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం వికెట్ కీపింగ్ కు మాత్రమే అన్నట్లు జట్టులో ఉన్నాడు. బ్యాటింగ్ స్థానంలో ఎక్కడో దిగుతూ జట్టుకు ఉపయోగ పడని రీతిలో పరుగులు చేస్తున్నాడు. దీంతో ఇప్పుడు ధోనీ బ్యాట్ తో మైదానంలోకి వస్తున్నా శబ్దంమామూలుగానే ఉంటోంది.
వాస్తవానికి ధోనీ 2019లోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అతడి హవా 2023 వరకు సాగింది. దీనికితగ్గట్లే ధోనీ మ్యాచ్ లను గెలిపించేవాడు.
గత ఏడాది, ప్రస్తుత సీజన్ లలో మాత్రం ధోనీ సాధారణ ఆటగాడిలా మారిపోయాడు. అవసరమైతే చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన ధోనీ ఇతడేనా? అనే అనిపిస్తోంది. అందుకే ధోనీ బ్యాటింగ్ కు వస్తుంటే ఇప్పుడు కుర్చీలు చరుస్తూ నినాదాలు చేస్తూ అభిమానులు సంబరాలు చేసుకోవడం లేదు. అది చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానం అయిన చెన్నైలో అయినా సరే.
మరోవైపు ధోనీ రిటైర్మెంట్ పై రెండు మూడు రోజులుగా ఒకటే చర్చలు నడిచాయి. అతడు మాత్రం రిటైర్ అయ్యేది లేదని తేల్చి చెప్పాడు.
మరి ధోనీ స్థానంలో ఈ ఐపీఎల్ లో ప్రేక్షాకదరణ పొందుతున్నది ఎవరేంటే? ఇంకెవరు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీనే. రోహిత్ ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కొట్టిన సిక్స్ అత్యధిక ప్రేక్షకుల స్పందన పొందింది. వాంఖడే స్టేడియం 129 డెసిబుల్స్ తో ప్రతిధ్వనించింది.
ఇక ముంబై ఇండియన్స్ పై రాయల్ చాలెంజర్స్ తరఫున కోహ్లి సోమవారం బ్యాటింగ్ కు దిగిన సందర్భంలో 138 డెసిబుల్స్ తో ప్రేక్షకులు శబ్దం చేశారు. ఈ ఐపీఎల్ లో ఇదే రికార్డు.