ఐపీఎల్ సంచలనం: సంజూ శాంసన్ కోసం చెన్నై –రాజస్థాన్ మళ్లీ చర్చలు! ధోని వారసుడిపై ఉత్కంఠ!
ఐపీఎల్ ప్రపంచంలో మరోసారి ట్రేడ్ విండో వేడి రాజుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
By: A.N.Kumar | 8 Nov 2025 10:43 AM ISTఐపీఎల్ ప్రపంచంలో మరోసారి ట్రేడ్ విండో వేడి రాజుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ సంజూ శాంసన్ ను తమ జట్టులోకి తీసుకురావడానికి చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న వార్తలు మరోసారి జోరందుకున్నాయి.
ధోని వారసుడి కోసం సీఎస్కే వ్యూహం
చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఒక కీలకమైన దశలో ఉంది. జట్టుకు సారథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోని వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో ధోని తర్వాతి కాలానికి సరిపోయే, విశ్వసనీయమైన భారతీయ వికెట్కీపర్-బ్యాట్స్మన్ అవసరం చెన్నైకి చాలా ముఖ్యమని మేనేజ్మెంట్ భావిస్తోంది. సంజూ శాంసన్ ఈ అవసరాలను తీర్చగల సరైన ఆటగాడిగా సీఎస్కే దృష్టిలో ఉన్నాడు.
*ట్రేడ్ విండో ముగిసే ముందు చివరి ప్రయత్నం
గతంలో సంజూ శాంసన్ ట్రేడ్పై ఊహాగానాలు వచ్చినప్పుడు, రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ను విడిచిపెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయితే, ఐపీఎల్ ట్రేడ్ విండో ముగియడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో, చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి రాజస్థాన్తో చర్చల పర్వాన్ని ప్రారంభించిందనే సమాచారం.
ఇది నగదు రూపంలో ట్రేడ్ అవుతుందా, లేక సీఎస్కే జట్టులోని ఒక ఆటగాడిని మార్పిడి పద్ధతిలో తీసుకుంటారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సంజూను తమ జట్టులో చేర్చుకోవడానికి చెన్నై తమ చివరి ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.
చెన్నైకి డబుల్ అడ్వాంటేజ్!
సంజూ శాంసన్ లాంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్సీ సామర్థ్యం ఉన్న భారతీయ ఆటగాడు సీఎస్కేకి లభిస్తే, అది డబుల్ లాభం అవుతుంది. బ్యాటింగ్లో స్థిరత్వం వస్తుంది. మిడిలార్డర్లో నమ్మకమైన ఆటతీరును అందించగల సామర్థ్యం సంజూకు ఉంది. కెప్టెన్సీ అనుభవం ఉండడం ప్లస్.. భవిష్యత్తులో ధోని తర్వాత జట్టును ముందుకు నడిపించే సత్తా. ఈ ట్రేడ్ కనుక జరిగితే, సీఎస్కేకి ధోని రిటైర్మెంట్ తర్వాతి కాలానికి కావాల్సిన స్థిరత్వం.. నాయకత్వ వారసత్వం లభించినట్లే అవుతుంది.
*రాజస్థాన్ నిర్ణయంపై అభిమానుల దృష్టి
సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్కు కేవలం ఆటగాడే కాదు, కెప్టెన్, కీలకమైన బ్రాండ్ ఫేస్ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ భారీ ఆఫర్పై ఏమి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఐపీఎల్ అభిమానులందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ సంజూ శాంసన్ చెన్నైకి మారితే, అది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద మరియు సంచలనాత్మక ట్రేడ్లలో ఒకటిగా నిలిచిపోవడం ఖాయం.
