బెన్ స్టోక్స్ - జడేజా మధ్య ఏమైంది..? వైరల్ వీడియో
ఇండియా vs ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్కు సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 28 July 2025 10:36 AM ISTఇండియా vs ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్కు సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లతో చేతులు కలిపే విషయంలో తిరస్కరించాడనే వీడియో వైరల్ అవుతోంది. నాలుగో టెస్టులో భారత జట్టు అత్యుత్తమ పోరాటం చేసి మ్యాచ్ను డ్రాగా ముగించింది. ఇదొక విజయం కాకపోయినా, సిరీస్లో నిలబడే అవకాశం భారత్కి ఇచ్చింది. కానీ మ్యాచ్ ముగిశాక జరిగిన ఓ చిన్న సంఘటన అభిమానుల్లో కలకలం రేపుతోంది.
-అసలేం జరిగిందంటే?
సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది పరస్పరం చేతులు కలుపుతూ గౌరవం చూపుతారు. కానీ మ్యాచ్లో స్టోక్స్ మాత్రం జడేజా , వాషింగ్టన్ సుందర్తో చేతులు కలపలేదు. దీనికి ముఖ్య కారణం మ్యాచ్ ముగిసే 15 ఓవర్లు ముందు, స్టోక్స్ మ్యాచ్ను డ్రా చేద్దాం అని సూచించాడు. అయితే జడేజా , సుందర్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు.
ఎందుకు తిరస్కరించారు?
ఆ సమయంలో భారత్ పూర్తి ఆధిపత్యంలో ఉండగా, ఇంగ్లాండ్ గేమ్లో తిరిగి వచ్చే అవకాశం లేదు. పైగా జడేజా , సుందర్ ఇద్దరికీ సెంచరీ పూర్తిచేయాలన్న వ్యక్తిగత లక్ష్యం ఉండటంతో, వారు ఆట కొనసాగించాలని నిర్ణయించారు. దీన్ని స్టోక్స్ స్వాగతించలేదు. దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ, మ్యాచ్ చివరిలో ఆయన హావభావాల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది.
క్లోజింగ్ సీన్
మ్యాచ్ ముగిశాక రెండు జట్లు షేక్ హ్యాండ్ చేయగా కెప్టెన్ స్టోక్స్ మాత్రం జడేజా, సుందర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోలేదు. ఈ ఘటన వీడియో రూపంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అభిమానుల్లో మిశ్రమ స్పందనలకు దారితీస్తోంది.
స్పోర్ట్స్మన్ షిప్ అంటే గెలుపోటములకన్నా ఎంతో ముఖ్యం. స్టోక్స్ వంటి సీనియర్ ఆటగాడు ఇలాంటి ప్రవర్తన చేయడం పట్ల కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు అతనికి మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. అయినా, జడేజా , సుందర్ తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేసిన తీరు మాత్రం ప్రశంసనీయం. ఈ ఘటనపై బీసీసీఐ లేదా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పందిస్తాయో లేదో వేచి చూడాలి.
