రా రండి.. ఆంధ్రాకు.. సన్ రైజర్స్ కు అనూహ్య ఆహ్వానం
సన్ రైజర్స్ పదేళ్లకు పైగా ఐపీఎల్ లో కొనసాగుతున్నా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను తన పేరు వెనుక తగిలించుకుంది.
By: Tupaki Desk | 3 April 2025 1:44 PM ISTదేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైనప్పటికీ.. సొంతంగా ఐపీఎల్ జట్టు లేని లోటు ఆంధ్రప్రదేశ్ ను వెంటాడుతోంది.. ఉమ్మడి రాష్ట్రంలో దక్కన్ చార్జర్స్ పేరిట అచ్చ తెలుగు వ్యక్తికి చెందిన ఐపీఎల్ జట్టు ఉన్నా.. ఆ తర్వాత అది సన్ రైజర్స్ అయి తమిళ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది.
సన్ రైజర్స్ పదేళ్లకు పైగా ఐపీఎల్ లో కొనసాగుతున్నా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను తన పేరు వెనుక తగిలించుకుంది. మరోవైపు మూడేళ్ల కిందటి లీగ్ లోకి కొత్తగా యూపీ రాజధాని లక్నో పేరిట సూపర్ జెయింట్స్, గుజరాత్ పేరిట గుజరాత్ టైటాన్స్ జట్ల వచ్చాయి.
మరి.. దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ కు ఐపీఎల్ జట్టు ఎప్పుడు? ఇది ఇప్పట్లో సాధ్యం కాదనే చెప్పొచ్చు. ఇక ఆంధ్రాకు చెందిన దిగ్గజ వ్యాపారి గ్రంథి మల్లికార్జునరావుకు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ మరో హోం గ్రౌండ్ గా విశాఖపట్టణాన్ని ఎంచుకుంది.
ఇక అసలు విషయం ఏమంటే.. ఇటీవల ఉచిత టికెట్ల విషయమై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ)తో పంచాయితీ నడవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు అనూహ్య ఆహ్వానం అందింది. సన్ రైజర్స్ ను తమ రాష్ట్రానికి రావాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పిలిచింది. ఈ సీజన్ లో మిగతా మ్యాచ్ లను విశాఖపట్నంలో నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు ఇస్తామని ఆఫర్ చేసింది.
ఆంధ్రా క్రికెట్ సంఘం ఆఫర్ ఎలా ఉన్నా.. సన్ రైజర్స్-హెచ్ సీఏ వివాదం సద్దుమణిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో హెచ్ సీఏ దిగొచ్చింది. వివాదం సమసిన నేపథ్యంలో ప్రస్తుతానికి సన్ రైజర్స్ కు మరో ఆలోచన ఉండకపోవచ్చు.