Begin typing your search above and press return to search.

ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తారా బాబూ?: వైవీ

By:  Tupaki Desk   |   3 Nov 2018 8:24 AM GMT
ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తారా బాబూ?: వైవీ
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను విభ‌జించి ఆంధ్రా ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలుప‌డ‌డానికి కార‌ణ‌మైన కాంగ్రెస్ పార్టీతో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు క‌ల‌సిపోవ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. తెలుగు వారి `ఆత్మ‌గౌర‌వం`కాపాడ‌తాన‌ని కంక‌ణం క‌ట్టుకున్న చంద్ర‌బాబు....అదే నినాదంతో ఏర్ప‌డ్డ టీడీపీని కాంగ్ర‌స్ తో క‌ల‌ప‌డంపై టీడీపీ నేతలు కొంతమంది బ‌హిరంగంగానే అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ `హ‌స్త‌`గ‌త‌మైన‌ చంద్ర‌బాబుపై సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోలింగ్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసి, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన చంద్రబాబు ...ప్రజాస్వామ్యాన్ని కాపాడ‌డం విడ్డూరంగా ఉంద‌ని వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారని, జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన నుంచి తప్పించుకునేందుకే ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నిక‌ల్లో ఒంటరిగా పోటీచేసి చంద్ర‌బాబు గెలిచిన‌ట్లు చ‌రిత్రలో లేద‌ని అన్నారు. త‌న స్వార్థ ప్ర‌యోజ‌నాలు, రాజకీయ అవసరాలు, ఉనికి కోసం ఏ పార్టీతో అయినా పొత్తులు పెట్టుకోవ‌డం ఆయ‌న‌కు అల‌వాట‌ని అన్నారు.

కానీ, ఆ పొత్తుల‌ను కూడా త్యాగంలా బిల్డ‌ప్ ఇవ్వ‌డం చంద్ర‌బాబుకు మాత్ర‌మే చెల్లింద‌న్నారు. ప్రజాస్వామ్యం ర‌క్ష‌ణ‌, దేశ భ‌విష్య‌త్తు కాపాడటం అంటూ జ‌నాల‌ను మ‌భ్య‌పెట్ట‌డంపై మండిపడ్డారు. ఏపీకి తీర‌ని అన్యాయం చేసిన కాంగ్రెస్‌తో టీడీపీ కలవడం ఎంతవరకు సమంజసమ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు ఒర‌గ‌బెట్టిందేమీ లేదని, 2006లో వెలిగొండ ప్రాజెక్ట్ ను దివంగత మ‌హా నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. ఆయ‌న హ‌యాంలోనే 60 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు సాగు, తాగు నీరందిస్తామన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడేందుకు దివంగత నేత ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చంద్ర‌బాబు తాకట్టుపెట్టారని మండిప‌డ్డారు. రాబోయే ఎన్నిక‌ల్లో చంద్రబాబును ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.