Begin typing your search above and press return to search.

టీడీపీ కుట్ర‌లు ఫెయిల్‌!.. వైసీపీదే గెలుపు!

By:  Tupaki Desk   |   29 Oct 2017 10:18 AM IST
టీడీపీ కుట్ర‌లు ఫెయిల్‌!.. వైసీపీదే గెలుపు!
X
కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట మునిసిపాలిటీ చైర్మ‌న్ గిరీ కోసం టీడీపీ వేసిన రాజ‌కీయ ఎత్తులు పూర్తిగా బద్నాం అయ్యాయి.ఇక్క‌డ టీడీపీకి కోరం లేక‌పోయినా.. వైసీపీని ఓడించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీకావు. వాస్త‌వానికి చైర్మ‌న్ ప‌ద‌వికి శుక్ర‌వార‌మే ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. స్థానిక మంత్రి దేవినేని ఉమా నేతృత్వంలో సాగిన రాజ‌కీయ నాట‌కంతో త‌మ్ముళ్లు. పెద్ద హైడ్రామాకు తెర‌దీశారు. పెద్ద ఎత్తున గ‌లాటా సృష్టించారు. త‌మ కౌన్సిల‌ర్ల‌ను తామే కిడ్నాప్ చేయించుకుని, దానిని వైసీపీపై నెట్టే ప్ర‌య‌త్నం చేశారు. కుర్చీలు విర‌గ్గొట్టారు. ర‌గ‌డ సృష్టించారు.

ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిని బెదిరించి చివ‌రికి ఈ ఎన్నిక‌ను శ‌నివారం నిర్వ‌హించేలా వాయిదా వేయించారు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అయినా కూడా రిట‌ర్నింగ్ అధికారి ఎన్నిక‌ను శ‌నివారానికి వాయిదా వేశారు.

ఇక‌, శ‌నివారం సీన్ పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. మునిసిప‌ల్ చైర్మన్‌ గా ఇంటూరి రాజగోపాల్‌ (చిన్నా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండురోజుల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. శనివారం పూర్తి బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వహించారు. టీడీపీ నాయకులు శుక్రవారం వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకుని పోడియం చుట్టూ - టీడీపీ - వైసీపీ కౌన్సిలర్ల సీట్ల మధ్య కంచె ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకే వైఎస్సార్‌ సీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు కౌన్సిల్‌ హాల్‌కు చేరుకున్నారు. 11 గంటల సమయంలో టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని - స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ - టీడీపీ కౌన్సిలర్లు వచ్చారు. నేరుగా ఎన్నికల అధికారి హరీశ్‌ ఉన్న పోడియం వద్దకు వెళ్లారు. తమ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేశారని, వారు వచ్చేవరకు ఎన్నికను వాయిదా వేయాలంటూ మరోమారు ఉద్రిక్త వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారు.

అయితే కోరం ఉన్నందున ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో తాము ఎన్నికను బహిష్కరిస్తున్నామని చెప్పి టీడీపీ నేతలు బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. చైర్మన్‌ అభ్యర్థిగా ఇంటూరి రాజగోపాల్‌ (చిన్నా)ను ప్రతిపాదిస్తున్నట్లు 10వ వార్డు కౌన్సిలర్‌ మహ్మద్‌ అక్బర్‌ చెప్పగా, 3వ వార్డు కౌన్సిలర్‌ జన్నుమహంతి అనంతలక్ష్మి బలపరుస్తున్నట్లు చెప్పటంతో చైర్మన్‌ గా చిన్నా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆయనతో ప్రమాణస్వీకారం చేయించి, నియామకపత్రాన్ని అందజేశారు. దీంతో టీడీపీ కుట్ర‌లు సాగకుండా పోయాయ‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శించారు. మ‌రోప‌క్క‌, టీడీపీ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రికాద‌ని ఆ పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్లు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.