Begin typing your search above and press return to search.

అన్న వ‌స్తున్నాడు...60 రోజుల ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   31 July 2017 6:29 PM IST
అన్న వ‌స్తున్నాడు...60 రోజుల ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌జ‌లంద‌రికీ చేరువ అయ్యేందుకు `అన్న వ‌స్తున్నాడు` పేరుతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ - వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు పార్టీ శర‌వేగంగా సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రతి ఇంటికి పార్టీని చేర్చేందుకు పార్టీ అధ్యక్షులు ప్రణాళిక రూపొందించారు. సోమవారం హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. 60 రోజుల విస్తృత ప్రచారానికి ప్రణాళిక రూపొందించారు. ఈ సమావేశంలో ప్రశాంత్‌ కిషోర్ - వారి బృందం కూడా సమావేశంలో పాల్గొని టెక్నికల్‌ ఇన్‌ పుట్‌ కూడా ఇచ్చారు. ఈ వివరాలను పార్టీ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ముందుగా నవరత్నాలు సభలు - వైఎస్‌ ఆర్‌ కుటుంబం - విజయ శంఖారావం కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ``గడప గడపకూ వైఎస్‌ ఆర్‌`` కార్యక్రమంలో వైఎస్‌ ఆర్‌ సీపీ నాయకులకు ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యారో.. అదే విధంగా మరో మూడు అంశాలను తీసుకొని ప్రజలకు చెంతకు వెళ్లనున్నారని చెప్పారు.

నవ రత్నాలు సభలు: (ఆగస్టు 11 నుంచి 29 వరకు)

ఇటీవల వైఎస్‌ ఆర్‌ సీపీ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవ రత్నాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 11 నుంచి 29వ తేదీ వరకు నవరత్నాలు సభలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉన్న ఇళ్లను పార్టీ పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు వెళ్లి కలవాల్సివుంటుందని తెలిపారు. గ్రామాల్లోని పోలింగ్‌ బూత్‌ లోని సభ్యులు, కన్వీనర్‌ ప్రతి ఇంటిని సందర్శిస్తారు. గతంలో ఇచ్చిన ప్రజాబ్యాలెట్‌ ను, ప్లీనరీలో ప్రకటించిన ప్రధాన సంక్షేమ పథకాలు, నవరత్నాలను ప్రజలకు వివరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వ్యక్తిగతంగా అన్ని కుటుంబాలను కలుస్తారు.

వైఎస్‌ ఆర్‌ కుటుంబం: ( సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 2 వరకు)

నవరత్నాలు సభల అనంతరం పార్టీ నాయకులు, బూత్‌ స్థాయి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పలకరిస్తారు. వారికి ఓ సెల్‌ నంబర్‌ ఇస్తారు. ఆ కుటుంబ సభ్యుడు నేరుగా నేను పార్టీ సభ్యుడిగా చేరుతానని అంగీకరించి పార్టీ నాయకులు ఇచ్చిన నంబర్‌ కు మిస్సుడ్‌ కాల్‌ ఇస్తే వారికి వైఉస్‌ జగన్‌ వాయిస్‌ కాల్‌ ద్వారా సమాధానం ఇస్తారు. వాయిస్‌ రిప్లై ఇవ్వడంతోపాటు, వివరాలు సేకరిస్తారు. వైఎస్‌ ఆర్‌ కుటుంబంలోకి ఆహ్వానిస్తారు. వెంటనే పార్టీ నాయకులు వారిని సంప్రదించి సభ్యత్వం ఇస్తారు. పార్టీ సభ్యత్వ రుసుం ఉండదు. పార్టీ సభ్యులందరీకి నేరుగా పోలింగ్‌ బూత్‌ నాయకులు అందుబాటులో ఉంటారు. ఇందులో భాగంగానే నవరత్నాల కరపత్రాలు కూడా ప్రతి ఇంటికి ఇస్తారు. గతంలో ఇచ్చిన ప్రజాబ్యాలెట్‌ పేపర్‌ కూడా మరోసారి ఇచ్చి చంద్రబాబు పాలనకు మార్కులు వేయిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారు. పార్టీ స్టిక్కర్‌ కూడా సభ్యత్వం పొందిన వారి ఇంటికి అతికిస్తారు. ఇది ఫ్రీ పోలింగ్‌ కూడా ఉపయోగపడుతుంది. అనుకూలంగా స్పందించించిన ఇంటికి ఒక స్టిక్కర్‌ అతికిస్తారని.. దీని ద్వారా తమకు ఎంతమంది అనుకూలంగా ఉన్నారనేది తెలుస్తుందన్నారు. వ్యతిరేకంగా ఉన్నవారిని ఆకట్టుకునేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

విజయ శంఖారావం(అక్టోబర్‌ 2 నుంచి 25 వరకు)

నవరత్నాలు సభలు, వైఎస్‌ ఆర్‌ కుటుంబం( సభ్యత్వం ) పూర్తయిన వెంటనే అక్టోబర్‌ 2 నుంచి 25వ తేదీ వరకు విజయ శంఖారావం కార్యక్రమాలు చేపడుతారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అక్టోబర్‌ 26 - 27వ తేదీల్లో పాదయాత్ర మొదలవుతోంది. ఆ లోగా ఈ మూడు కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పాదయాత్రపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది. దీనికి ముందే శంఖారావం పూరిస్తారు. ప్రతి నియోజకవర్గానికి ప్రశాంత్‌కిషోర్‌టీమ్‌లోని సభ్యుడు ఉంటారు. వారి సలహాలు, సూచనలు ఇస్తారు. వారి సంప్రదింపులు కూడా ఇందులో ఉంటాయి. ఈ 60 రోజులు ఈ మూడు కార్యక్రమాలు విజయవంతంగా చేసేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ బృందం సహకరిస్తారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన మూడు కార్యక్రమాలను విజయవంతం చేద్దామని ఆయ‌న పిలుపునిచ్చారు.