Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘తేనె పూసిన కత్తి’ విజయసాయికి మస్తు నచ్చింది

By:  Tupaki Desk   |   20 Sept 2020 4:00 PM IST
కేసీఆర్ ‘తేనె పూసిన కత్తి’ విజయసాయికి మస్తు నచ్చింది
X
వ్యవసాయ బిల్లును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టటమే కాదు.. ఆ బిల్లు తేనె పూసిన కత్తిగా అభివర్ణించటం తెలిసిందే. కార్పొరేట్ గద్దలు దేశమంతా విస్తరించటానికే ఈ బిల్లును చట్టంగా తెస్తున్నట్లుగా కేసీఆర్ మండిపటమే కాదు.. తన పార్టీ ఎంపీల చేత ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతులకు దెబ్బ తీసే ఈ బిల్లును కచ్ఛితంగా వ్యతిరేకించాల్సిందేనని స్పష్టం చేసిన కేసీఆర్ తీరుకు భిన్నంగా వ్యవహరించింది ఏపీ సర్కారు.

మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లుగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వాదనకు భిన్నంగా ఉండటం గమనార్హం.

గతంలో దళారీల దయాదాక్షిణ్యాలపై రైతులు బతికారని.. తాజా బిల్లుతో రైతులకు గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. నచ్చిన చోట పంటను అమ్ముకోవటం వల్ల రైతులకు లబ్థి చేకూరుతుందన్న విజయసాయి.. బిల్లుకు తమ పార్టీ మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు.

వ్యవసాయ మార్కెట్లు రైతులకు గిట్టుబాటు ధరను కల్పించటం లేదని.. మధ్యవర్తుల కారణంగా రైతులు నష్టపోతున్నారని.. ఈ బిల్లు కానీ చట్టంగా మారితే.. ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన బిల్లును జగన్ అండ్ కో అందుకు భిన్నంగా పూర్తి మద్దతును ఇవ్వటం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.