Begin typing your search above and press return to search.

రోజా మరో రేవంత్ రెడ్డి అవుతుందా?

By:  Tupaki Desk   |   20 Dec 2015 8:02 AM GMT
రోజా మరో రేవంత్ రెడ్డి అవుతుందా?
X
రాజకీయాల్లో ఎదగడానికి సెన్సేషన్ ఎంత హెల్ప్ చేస్తుందో.. ఒక్కోసారి అంతే చేటు చేస్తుది. సెన్సేషనల్ స్టెప్స్ కారణంగా రాజకీయాల్లో వేగంగా పైకెదిగినవారు ఎందరో ఉన్నారు. ఒక్కోసారి వారి పట్ల ప్రభుత్వాలు - ఇతర నిర్ణయాల ప్రభావాలు కూడా ఎదుగుదలకు సహకరిస్తాయి. అయితే... అదేసమయంలో కీలక వ్యవహారాల్లో ఒక్కసారిగా పాపులర్ అయి మళ్లీ అదే కారణంగా దెబ్బతినడం ఇటీవల కాలంలో రాజకీయాల్లో కనిపిస్తోంది. కొద్ది నెలల కిందట తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ కేసులో ఇరుక్కుపోయిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హీరో అయ్యారని అంతా భావించారు. ఆ కేసు వల్ల ఆయన ఇమేజికి డ్యామేజి జరగాల్సింది పోయి పాపులారిటీ వచ్చేసింది. కొద్ది రోజులు ఆ హడావుడి కనిపించినా క్రమంగా దానివల్ల ఆయన నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ గుడ్డిగా వ్యవహరించి దొరికిపోవడంతో పార్టీ ప్రతిష్ఠ, తన ప్రతిష్ఠ కూడా మంటగలిసిందని చంద్రబాబు భావించడమే అందుకు కారణం. ప్రత్యక్ష చర్యలేమీ తీసుకోకపోయినా రేవంత్ ప్రాధాన్యాన్ని మాత్రం తగ్గించేశారు. అంతేకాదు... ఆ కేసుతో బద్ధ విరోధులుగా మారిన చంద్రబాబు, కేసీఆర్ లు మళ్లీ ఇప్పుడు కలిసిపోయారు.. కానీ, రేవంత్ మాత్రం ఇద్దరికీ దూరమై ఇరుకునపడ్డారు. పరిస్థితులు గ్రహించిన టీటీడీపీలోని ఇతర నేతలు నిత్యం అధినేతకు రేవంత్ పై ఫిర్యాదులు చేస్తూ పూర్తిగా తొక్కేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ఏపీ అసెంబ్లీలో ఏడాది పాటు సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా అదే గతి పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజా అసెంబ్లీలో దూకుడుగా ఉండడంతో మంచి పాపులారిటీ తెచ్చుకుంటోందని చాలామంది అనుకుంటున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వైసీపీలోనే ఆమె పట్ల చాలామంది సీనియర్లు మండిపడుతున్నారు. పద్ధతిపాడు లేకుండా రచ్చరచ్చ చేయడం వల్ల పార్టీ పరువు పోతుందని వారు ఆగ్రహిస్తున్నారు. ఆ సంగతిని జగన్ తో కూడా వారు చెప్పారని సమాచారం.

అంతేకాదు... అసెంబ్లీ నిర్వహిస్తే రెచ్చిపోయే ఆమె మామూలు సమయాల్లో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండకుండా సొంత కార్యక్రమాలు, టీవీ షోల్లో ఎక్కువగా కనిపిస్తుంటారని... శాసనసభ ఉంటే మాత్రం తెగ హడావుడి చేసి మార్కులు కొట్టేసే ప్లానుతో వెళ్తారని అంటున్నారు. తాను ఒక మహిళా నేత అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్న రోజా కారణంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని మైసూరా, బొత్స వంటి నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రస్తుతం ఆమె ఏడాది పాటు సస్పెండవడం... వైసీపీని టీడీపీని టార్గెట్ చేసిన సమయంలో సొంత పార్టీయే ఆమె పట్ల ఆగ్రహిస్తే టీడీపీ మరింత రెచ్చిపోయే ప్రమాదముందని భావించిన జగన్ తర్వాత చూద్దాంలే అన్నట్లు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీ పూర్తయిన తరువాత జగన్ ఆమెను పిలిచి హెచ్చరిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు... ఆమె తీరు ఇలాగే ఉంటే సీనియర్ల నుంచి కంప్లయింట్లు అదే స్థాయిలో ఉంటాయని...దాంతో జగన్ కూడా ఆమె కు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గిస్తారని అంటున్నారు. చూడబోతే తాజా పరిణామాల దెబ్బకు రోజా మరో రేవంత్ రెడ్డి అయ్యేలా ఉన్నారు.