Begin typing your search above and press return to search.

వైసీపీతో తనకు ప్రాణహాని: వైసీపీ ఎంపీ లేఖ

By:  Tupaki Desk   |   21 Jun 2020 2:36 PM GMT
వైసీపీతో తనకు ప్రాణహాని: వైసీపీ ఎంపీ లేఖ
X
వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తనకు ప్రాణహాని ఉందని.. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు రక్షణ కల్పించాలని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సంచలమైంది.

ఆ లేఖలో వైసీపీ ఎంపీ రఘురామ పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘ తిరుమల శ్రీవారి భూముల అమ్మకం అంశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలవడానికి ప్రయత్నించానని అప్పటి నుంచి తన నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తున్నారని ’ వైసీపీ ఎంపీ రఘురామ ఆరోపించారు. కోట్లాది భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేశానని.. మీడియా ద్వారా చెప్పానని.. ఇలా బహిరంగంగా చెప్పినందుకు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని వాపోయాడు.

ఇక ఏపీ ప్రభుత్వ ఇసుక వ్యవహారంలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని సామాన్యులకు న్యాయం చేయాలని కోరితే వైసీపీ ఎమ్మెల్యేలతో విమర్శలు చేయిస్తున్నారని వైసీపీ ఎంపీ తెలిపారు. నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని బెదిరిస్తున్నారన్నారు. స్థానిక పోలీసులకు తన వ్యక్తిగత కార్యదర్శి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

ఇక అంతకుముందు ఎంపీ రఘురామకృష్ణం రాజు పర్సనల్ సెక్రటరీ కృష్ణవర్మ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల వల్ల రఘురామకృష్ణం రాజుకు ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. ఎంపీ సొంత నియోజకవర్గానికి వస్తే దాడి చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రఘురామకృష్ణం రాజుకు నియోజకవర్గంలో రక్షణ కల్పించాలని కోరారు.