Begin typing your search above and press return to search.

బాబుకు ద‌మ్ముంటే చాలెంజ్ చేయాల‌ట‌

By:  Tupaki Desk   |   8 Sep 2016 6:27 AM GMT
బాబుకు ద‌మ్ముంటే చాలెంజ్ చేయాల‌ట‌
X
ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్యాకేజీతో స‌రిపుచ్చ‌డం - ఈ ఎపిసోడ్‌ పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్పంద‌న‌పై ప్ర‌తిప‌క్ష‌ వైఎస్ ఆర్ కాంగ్రెస్ మండిప‌డింది. అసెంబ్లీ సమావేశాల నేప‌థ్యంలో ఆ పార్టీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశం నిర్వ‌హించుకుంది. అనంత‌రం వైకాపా ఎమ్మెల్యేలు కోటం శ్రీ‌ధ‌ర్ రెడ్డి - కోన రఘుపతి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ బాబు తీరుపై విరుచుకుప‌డ్డారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే తెల్లజెండా చూపించి వెన్నుచూపిన పారిపోయిన‌ పిరికి సైనికుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాల్సిన చంద్రబాబు మౌనంగా ఉండ‌టం ఆయ‌న తీరుకు అద్దం ప‌డుతోంద‌ని వైకాపా ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు.

ప్రత్యేక హోదా - ఓటుకు నోటు - కరవు అంశాలపై ప్రభుత్వం బదులివ్వకుండా పారిపోయేందుకు మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు. జీఎస్‌ టి బిల్లుపై గంట - గంటన్నర చర్చించి సభను ముగిస్తామనే ధోరణిలో ప్రభుత్వం ఉన్నట్లు కనపడుతోందని అనుమానం వ్య‌క్తం చేశారు. ప్రాధాన్యత కలిగిన అంశాలపై సభను పక్కదోవ పట్టిస్టే ఊరుకోమన్నారు. కృష్ణా పుష్కరాలను అవినీతిమయం చేశారన్నారు. అదే స‌మ‌యంలో పుష్కరాలకు నీళ్లు వదిలి - ఖరీఫ్ పంటకు నీళ్లు ఇవ్వనందున పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యేలు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పులిచింతలలో నీళ్లు ఉన్నా - పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వాలని నిర్ణయించడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో టేపుల్లో ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మి’ అన్న స్వరం తనది కాదని చంద్రబాబు ప్రకటించగలరా అని వైసీపీ ఎమ్మెల్యేలు సవాలు విసిరారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆడియో టేపుల్లో ఉన్నది తన స్వరం కాదని కేసీఆర్‌ కు సవాలు విసరాలని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌ లకు టేపులను పంపించి, ఆ స్వరం తనది కాదని రుజువు చేసుకోవాలని వారు సవాలు విసిరారు. ఓటుకు నోటు కేసుతో ప్రత్యేక హోదాను బలి చేశారన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులతో చంద్రబాబు దొంగాట ఆడుతున్నారన్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం అంటే నిప్పుతో చెలగాటమాడటమేన‌ని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.