Begin typing your search above and press return to search.

చిరకాల కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన వైసీపీ కీలక నేత!

By:  Tupaki Desk   |   2 Sept 2020 12:15 PM IST
చిరకాల కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన వైసీపీ కీలక నేత!
X
వైసీపీ లో మరో విషాదం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత ప్రముఖ వస్త్ర వ్యాపారి, బొమ్మన బ్రదర్స్‌ అధినేత రాజ్‌కుమార్‌ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. వైసీపీలో కీలక నాయకుడిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ రాజ్‌కుమార్‌ మరణవార్తతో పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు.

రాజ్‌కుమార్ పార్థీవ దేహాన్ని రాజమండ్రి తీసుకొచ్చారు. బుధవారం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్‌కుమార్‌ ఆకస్మిక మృతికి సంతాప సూచికంగా నగరంలోని అన్ని దుకాణాలను బుధవారం స్వచ్ఛందంగా మూసివేసేందుకు నిర్ణయించినట్లు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన ది జాంపేట కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నారు.

దివంగత వస్త్ర వ్యాపారి బొమ్మన రామచంద్రరావు కుమారుడైన బొమ్మన రాజ్‌కుమార్ ‌కు భార్య,ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు కూడా వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. 20 సంవత్సరాల వయసులోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన బొమ్మన , అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్రవ్యాప్తంగా తమ వ్యాపారాలను విస్తరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన... వ్యాట్ ట్యాక్స్ రద్దు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. శ్రీశైలం దేవస్థానం దేవాంగ సత్రం చైర్మన్‌గా కూడా ఉన్నారు. వైసీపీ తరుపున రాజమహేంద్రవరం మొట్టమొదటి నగర కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార రంగంలో రాణించిన బొమ్మన రాజ్‌కుమార్‌ కు రాజకీయాల్లోనూ రాణించాలన్న కోరిక ఉండేది. ఒకప్పుడు తన తండ్రి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం, వ్యాపార రంగంలో తన పోటీదారు చందన రమేష్ ఎమ్మెల్యేగా గెలవడంతో తాను కూడా ఎమ్మెల్యేగా చేయాలన్న కోరిక రాజ్‌ కుమార్‌ లో బలంగా ఉండేది. 2014లో వైసీపీ తరుపున పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. మధ్యలో టీడీపీలో చేరి తిరిగి వైసీపీ గూటికే వచ్చారు. అయితే , అయన తన చిరకాల వాంఛ తీరకుండానే ఆయన కన్నుమూశారు.