Begin typing your search above and press return to search.

నాడు ప్లస్... నేడు రివర్స్... జగమంత వర్రీ... ?

By:  Tupaki Desk   |   7 March 2022 10:00 PM IST
నాడు ప్లస్... నేడు రివర్స్... జగమంత వర్రీ... ?
X
రాజకీయాల్లో అనుకూలంగా ఉంటేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. గోదారి మీద వాలుగా సాగే పడవలా వీలు చూసుకుని రాజకీయం జోరు చేస్తుంది. అలా 2019 ఎన్నికలకు చాలా కాలం ముందే వైసీపీకి అన్నీ శుభ శకునాలే కనిపించాయి. తోడుగా తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల, బావ అయిన బ్రదర్ అనిల్ కుమార్ అందరూ కూడా జగన్ కి కొండంత అండ. ఇక వైఎస్సార్ సన్నిహితులు అయిన కేవీపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారి పరోక్ష దీవెనలు జగన్ కి ఉన్నాయి.

ఇక వివిధ వర్గాల ప్రజానీకం మొత్తం వైసీపీ వైపే ఏకమొత్తనా చూపు సారించారు. అన్నీ కలసి వచ్చి జగన్ కి బ్రహ్మాండమైన మెజారిటీ దక్కింది. 151 సీట్లతో చారిత్రాంతమక విజయాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. అయితే మూడేళ్ళు గట్టిగా తిరిగేసరికి రాజకీయ వ్యక్తులు, శక్తులు అన్నీ కూడా ఎదురు నిలుస్తున్నాయి. అదే టైమ్ లో వైఎస్సార్ ఫ్యామిలీలోనే చీలిక వచ్చేసింది. సొంత చెల్లెలు షర్మిల జగన్ కి దూరం జరిగారు.

ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ నాడు జగన్ విజయం కోసం కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగారు. ఆయన తనకున్న పరిచయాలు అన్నీ వాడేసి మరీ క్రైస్తవ సోదరులను మొత్తం ఈ వైపుగా తిప్పారని అంటారు. ఇపుడు అదే బావ జగన్ మీద కన్నెర్ర చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఏలుబడిలో క్రైస్తవ సోదరులు, ఎస్సీలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారని సంచలన కామెంట్స్ చేశారు.

తనతో సమావేశమైన సందర్భంగా వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారని కూడా అనిల్ చెప్పడం విశేషం. మరో వైపు చూస్తే జగన్ సోదరి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సైతం జగన్ మీద తమ బాణాలను ఎక్కుపెట్టారు. వివేకా కేసు విషయమై వారు వైసీపీ సర్కార్ నాడు అనుసరించిన వైఖరిని తప్పుపడుతున్నారు.

ఇంకోవైపు చూస్తే ఏపీలో నాడు అన్ని సామాజికవర్గాలూ వైసీపీకి గట్టిగా మద్దతు ప్రకటించాయి. ఇపుడు చాలా వర్గాలలో చూస్తే ఆందోళన అయితే ఉంది. నాడు జగన్ గెలుపు కోసం సహకరించిన ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు పీయార్సీ విషయంలో తమకు తీరని అన్యాయం జరిగింది అని గుర్రు మీద ఉన్నాయి. ఇంకో వైపు నిరుద్యోగులు సైతం జాబ్ క్యాలండర్లు ఏవని నిలదీస్తున్నారు. ఉద్యోగులకు 62 ఏళ్లకు పదవీ విరమణ వయసుని పెంచడాన్ని వారు విమర్శిస్తున్నారు

జగన్ మానస పుత్రికగా ఏపీలో ఏర్పాటు అయిన సచివాలయంలో లక్షా పాతిక వేల మంది ఉద్యోగులను నియమించారు. అయితే వీరికి రెండేళ్ల తరువాత ప్రోబేషన్ ఇస్తామని చెప్పి ఇపుడు 2022 జూన్ దాకా దాన్ని పొడిగించడం, దాని కోసం డిపార్ట్మెంటల్ టెస్టులు రాయించడం వంటి వాటి మీద గుర్రుగా ఉన్నారు.

ఇంకో వైపు సంక్షేమ పధకాలు అందిన వారు సైతం సంతృప్తిగా లేరు. తమకు పెరిగిన ధరలతో ఇస్తున్న పధకాల వల్ల ఏమీ ప్రయోజనం లేకుండా పోతోందని అంటున్నారు. ఈ పధకాలు వివిధ కారణాల వల్ల వర్తించని వారైతే ఆగ్రహిస్తున్నారు. కాపు కార్పోరేషన్ వల్ల ఏమీ ఒనకూడినది లేదని ఆ వర్గం చింతిస్తూంటే బ్రాహ్మణ కార్పోరేషన్ ఉనికి ఎక్కడో చెప్పమని ఆ సామాజిక వర్గం ప్రశ్నిస్తోంది.

బీసీలకు పెద్ద పీట అంటూ నామినేటెడ్ పదవులు ఇచ్చారు, కానీ వారికి కూర్చోవడానికి ఎక్కడ చోటు ఉందని, ఆఫీసులు ఏవని అడుగుతున్నారు. పైగా బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని వారు గోడుపెడుతున్నారు. ఇలా అన్ని సామాజికవర్గాల్లో ఇపుడు పెద్ద ఎత్తున అసంతృప్తి కనిపిస్తున్న వేళ వైసీపీ తప్పనిసరిగా జాగ్రత్త పడాలని అంటున్నారు. లేకపోతే 2024 ఎన్నికలు ఇబ్బందిగా మారుతాయని అంటున్నారు.