Begin typing your search above and press return to search.

సబ్బం హరికి వదలని నోటీసుల పర్వం.. మరోసారి ఎందుకంటే?

By:  Tupaki Desk   |   7 Nov 2020 11:30 AM IST
సబ్బం హరికి వదలని నోటీసుల పర్వం.. మరోసారి ఎందుకంటే?
X
ఏపీ సీనియర్ నేత.. సీఎం జగన్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా పేరున్నమాజీ ఎంపీ సబ్బం హరికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్నఅక్రమ నిర్మాణాలు నిర్మించినందుకు ప్రభుత్వం ఆయన నిర్మాణాల్ని కూల్చివేయటం..దీనిపై ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేయటం తెలిసిందే. తనకు ముందే చెబితే.. తానే తొలగించేవాడినన్న చిలుక పలుకులు చెప్పినా.. అన్ని తెలిసిన పెద్ద మనిషి.. అక్రమ నిర్మాణాన్ని ఎందుకు నిర్మించారన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేశారు. రిజర్వు ఓపెన్ స్పేస్ లో భవనాల్ని నిర్మించారని.. మూడురోజుల్లో వాటిని తొలగించాలని పేర్కొన్నారు. నోటీసులు అందించేందుకు అధికారులు సబ్బం నివాసానికి వెళ్లగా.. ఆయన లేరు. నోటీసుల్ని వాచ్ మెన్ తీసుకునేందుకు నిరాకరించటంతో.. గోడకు అంటించి వెళ్లిపోయారు. రేసపువాని పాలెం సర్వే నెంబరు ఏడులో సుమారు 40 ఏళ్ల క్రితం ఏపీ ఎస్ ఈబీ కో-ఆపరేటివ్ లేఔట్ వేశారు.

ఇక్కడి ప్లాన్ ప్రకారం సుమారు 2200 గజాల స్థలాన్ని రిజర్వు ఓపెన్ స్పేస్ గా మార్కు చేశారు. ప్రస్తుతం అందులోని కొంత భాగంలో సబ్బం హరికి చెందిన రెండు భవనాలు.. మరో ముగ్గురు వ్యక్తులకు చెందిన భవనాలు ఉన్నాయి. ఓపెన్ స్పేస్ లో నిర్మించిన భవనాల్ని ఎవరికి వారు స్వయంగా తొలగించాలని అధికారులు కోరారు. దీనికి సంంధించిన నోటీసులు అందజేశారు. ఇదిలా ఉండగా.. తన స్థలంలోని నిర్మాణాల తదుపరి కూల్చివేతల్ని అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు.. సోమవారం వరకు స్టేటస్ కోను విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ సోమవారం సాగనుంది.