Begin typing your search above and press return to search.

కోలగట్లకు ఎమ్మెల్సీ వెనక..!?

By:  Tupaki Desk   |   16 March 2015 2:30 PM GMT
కోలగట్లకు ఎమ్మెల్సీ వెనక..!?
X
అసెంబ్లీలో వైసీపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. ఆ ఇద్దరిలో ఒకరు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అయితే, మరొకరు కోలగట్ల వీరభద్రస్వామి. పిల్లి సుభాష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ మీద అభిమానంతో అందరికంటే ముందు వైసీపీలోకి వచ్చిన వ్యక్తి ఆయన. జగన్‌కు అండదండగా నిలిచారు కూడా. మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కు కావడంతో ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు కనక ఆయన ఎంపిక సరైనదే.

ఇక, కోలగట్ల వీరభద్రస్వామి నిన్న మొన్నటి వరకూ పీసీసీ మాజీ అధ్యక్షుడు బత్స సత్యనారాయణకు కుడిభుజంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌లోనే గత ఎన్నికలకు ముందు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. భారీగా ఆస్తులున్న కోలగట్ల అప్పట్లోనే పెద్దఎత్తున ముట్టజెప్పారని, అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందనే ఆరోపణలు కూడా వెలువడ్డాయి. పదిలోనూ ఎనిమిది వేళ్లకు ఉంగరాలు, ముంజేతికి కంకణాలు, మెడలో తాడులాంటి బంగారం గొలుసులతో కనిపించే కోలగట్ల పదవి కోసం డబ్బులకు వెనకాడే వ్యక్తి కాదని కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే, 2014 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వచ్చారు. అప్పట్లోనే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.

ఆ తర్వాత కోలగట్లను విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది ఆ పార్టీ. ఇప్పుడు ఆయనకే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. వైసీపీ ఆవిర్భవించిన తొలి రోజుల నుంచీ పోరాడిన వ్యక్తుల్లో కోలగట్ల లేరు. జగన్‌ జైల్లో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకున్నది లేదు. పోనీ, పార్టీ తరఫున, జగన్‌ తరఫున గట్టిగా మాట్లాడే వ్యక్తికూడా లేదు. ఇటువంటి ఎన్నో అర్హతలు ఉన్నవాళ్లు వైసీపీలో ఉన్నారని, వారిని ఎవరినీ జగన్‌ పరిగణనలోకి తీసుకోలేదని వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు. కోలగట్లకు ఉన్న ఏకైక అర్హత డబ్బు మాత్రమేనని విమర్శిస్తున్నారు.