Begin typing your search above and press return to search.

వాయిదా పడ్డ వైఎస్సార్సీపీ జాబితా - వేదిక మారింది

By:  Tupaki Desk   |   16 March 2019 4:14 AM GMT
వాయిదా పడ్డ వైఎస్సార్సీపీ జాబితా - వేదిక మారింది
X
అన్నీ బాగుంటే ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను జగన్ విడుదల చేయాల్సింది. ఇడుపులపాయ వేదికగా.. ఒకే సారి రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాలకూ - అసెంబ్లీ స్థానాలకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జాబితాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు జగన్ ఇడుపులపాయకు చేరుకుని అభ్యర్థుల ప్రకటన చేయాల్సింది.

అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావడం పెను సంచలనాన్ని రేపింది. అభ్యర్థుల ప్రకటన కోసం ఇడుపుల పాయకు చేరుకోవాల్సిన జగన్ మోహన్ రెడ్డి - బాబాయ్ హత్యతో పుట్టెడు దుఃఖంలో పులివెందులకు వచ్చారు. ఈ రోజు వివేకానందరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కార్యక్రమం వాయిదా పడింది.

అభ్యర్థుల ప్రకటన కార్యక్రమం గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. మొత్తం అభ్యర్థులను జగన్ రేపు ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకు వేదిక కూడా మారింది. ఈ రోజు రాజకీయ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి.

ముందుగా అనుకున్నట్టుగా అయితే.. ఈ రోజు అభ్యర్థుల ప్రకటన చేసి..గుంటూరు జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాల్సింది. అయితే ఆ కార్యక్రమాలు అన్నీ రద్దు అయ్యాయి. పిడుగురాళ్ల ప్రచార కార్యక్రమం కూడా రద్దు అయ్యింది.

విశాఖ వేదికగా రేపు జగన్ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో పాటు.. అక్కడ నుంచినే అభ్యర్థుల ప్రకటనను కూడా చేయబోతూ ఉన్నారని తెలుస్తోంది.